రఘునాథపల్లి: మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఒకే రోజు 52 మంది విద్యార్థులు చేరారు. సర్పంచ్ తోటకూర సదానందం తన కూతురును చేర్పించడంతో గ్రామస్తులు ఆయనను అనుసరించారు. పాఠశాలలో 49 మంది విద్యార్థులుండగా, శుక్రవారం 52 మంది చేరడంతో విద్యార్థుల సంఖ్య 101కి చేరడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన సమావేశానికి ఎంఈఓ రఘునందన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించిన సర్పంచ్తోపాటు గ్రామస్తులను అభినంధించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు.


