హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో గురువారం ఉగాది, సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈఓ ధరణికోట అనిల్కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం దేవాలయంలో ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఉగాది వేడుకల్లో భాగంగా సాయంత్రం పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ ఉదయం స్వామివారికి ఉగాది పచ్చడి నివేదన, సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మాసశివరాత్రి పూజలు..
మాసశివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకుల ప్రణవ్, సందీప్శర్మ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతికి ఆరాధన, శ్రీరుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం నాట్యమండపంలో రుద్రేశ్వరిదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివారిని ప్రతిష్ఠించి కలశస్థాపన, బాసికధారణ, యజ్ఞోపవీతధారణ, పాదప్రక్షాళన, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి శ్రీరుద్రేశ్వరిదేవి, శ్రీరుద్రేశ్వరస్వామికి కల్యాణోత్సవం నిర్వహించారు.


