
ఆస్పత్రి నుంచే ప్రజా సమస్యలపై ఆరా ..
జనగామ: ఎర్రవెల్లి ఫాంహౌస్లో జారిపడి గాయపడిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రజాసమస్యలపై ఆరా తీస్తున్నారు. గురువారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు లను పరిశీలించి సంతకాలు చేశారు. తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రజలకు అవసరమైన సేవలు అందించడమే తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకు ముందు ఆస్పత్రిలో పల్లాను మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పరామర్శించారు.
ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గూడూరు గ్రామంలో రూ.49 లక్షలతో చేపట్టిన మసీదు ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసిన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమార స్వామి, జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎం.డీ మదార్, గ్రామ అధ్యక్షుడు దేవేందర్, సేవాదళ్ రాష్ట్ర నాయకుడు గుగ్గిళ్ల ఆదినారాయణ, మాజీ సర్పంచ్ మాచర్ల పుల్లయ్య, ఎండీ.అబ్బాస్అలీ, ఎండీ.సలీం, శంషొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
యోగా దినోత్సవాన్ని
విజయవంతం చేయాలి
జనగామ రూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో ఈనెల 21న ఉదయం 7 గంటలకు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బందికి సూచించారు. యోగాపై అవగాహన అవసరమని, ప్రస్తుత జీవనశైలిలో ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా మంచి సాధనమని పేర్కొన్నారు.
ప్లాస్టిక్ రహిత
జనగామ పట్టణమే లక్ష్యం
జనగామ: ప్లాస్టిక్ రహిత జనగామ పట్టణమే లక్ష్యమని, ఇందులో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం అవసరమని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాణిజ్య, వ్యాపార, పరిశ్రలు, గృహ, గృహేతర అన్ని వర్గాల ప్రజలు ప్రమాదకరమైన ప్లాస్టిక్ ను వినియోగించొద్దని సూచించారు. ప్లాస్టిక్(అన్ని రకాలు) విక్రయించిన వారికి రూ.5వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించనున్నట్లు కమిషనర్ తెలిపారు. అవసరమైతే దుకాణాన్ని సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
ఉచిత శిక్షణకు
దరఖాస్తు చేసుకోవాలి
జనగామ రూరల్: తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కేంద్రం ద్వారా 2026 సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ కోచింగ్ నిమిత్తం ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి బి.రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 100 మంది ప్రతిభావంతులను జూలై 12న నిర్వహించే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తామ ని చెప్పారు. మరో 50 మందిని గతంలో సివిల్ సర్వీసెస్(ప్రీలిమ్స్) పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సంబంధిత పత్రాలతో నేరుగా టీజీ బీసీ స్టడీ సర్కిల్, రోడ్ నంబర్ 8, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్ 500059 అడ్రస్కు జూలై 8వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశం పొందిన వారికి బోర్డింగ్, రవాణా సౌకర్యం నిమిత్తం నెలకు రూ.5,000 స్టైఫండ్, రూ.5,000 బుక్ ఫండ్ ఒకసారి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రంథాలయ సదుపాయం కల్పిస్తారని, మరిన్ని వివరాలకు 040–29303130, 04024071178, 7780359322, హనుమకొండ 0870–2571192 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఆస్పత్రి నుంచే ప్రజా సమస్యలపై ఆరా ..