
డ్రగ్స్పై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
జనగామ రూరల్: డ్రగ్స్పై విద్యార్థులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. గురువారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన డీఏడబ్ల్యూఎన్ డ్రగ్ ఫ్రీ ఇండియా స్కీమ్–2025పై పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జడ్జి మాట్లాడారు. మారకద్రవ్యాలు ఎలా తయారవుతాయి, అవి మనుషులపై ఎలా ప్రభావం చూపుతాయి.. వాటికి యువత ఎలా బానిసలవుతారు.. మదకద్రవ్యాలు అమ్మేవారు చిన్నపిల్లలను ఎలా టార్గెట్ చేస్తున్నారు.. వారిని ఏ విధంగా బానిసలను చేస్తున్నారు.. అనే అంశాలపై వివరించారు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడొద్దని, తినే వస్తువులు ఇస్తే తీసుకోరాదని సూచించారు. మాదకద్రవ్యాలు.. చాక్లెట్లు, స్టిక్కర్లు ఏరూపంలోనైనా ఉండొచ్చని, జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. అపరిచితులు ద్విచక్ర వాహనాలపై లిఫ్ట్ ఇస్తానంటే వెళ్లొద్దని, ముఖ్యంగా బాలికలు చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ఎంఈఓ శంకర్రెడ్డి, పీఎల్వీ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్