● అన్ని పార్టీలకు అసమ్మతి బెడద ● కాంగ్రెస్కు మరింత ఎక్
కోరుట్ల: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసిన క్రమంలో అసమ్మతి పోరుపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. బీఫాం అందించే లోపు పార్టీల్లో నెలకొన్న అసమ్మతిని సరిచేసి అభ్యర్థులను గెలుపు బాటలో నిలపాలన్న లక్ష్యంతో పార్టీ నేతలు బుజ్జగింపులు, బేరసారాలకు తెర తీశారు. ఈ క్రమంలోనే తమ పార్టీ అభ్యర్థులు ఎంత మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ఎంత మంది రెబల్స్ ఉన్నారన్న అంశంపై దృష్టి సారించారు.
అసమ్మతి పోరు
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో అత్యధికంగా కాంగ్రెస్కు రెబల్స్ బెడద ఉండటం గమనార్హం. అఽధికార పార్టీ టికెట్ కోసం ఒక్కోవార్డులో 5 నుంచి 6 దరఖాస్తులు రావడం, వీటిలో సరైన అభ్యర్థి ఎంపిక చేయడం పార్టీ వర్గాలకు పెద్ద సమస్యగా మారినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ వార్డుల్లో తప్ప మిగిలిన అన్ని వార్డుల్లోనూ కాంగ్రెస్ టిక్కెట్ కోసం పోటాపోటీగా దరఖాస్తులు రావడంతో అసమ్మతి అభ్యర్థులను బుజ్జగించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సారి బీఆర్ఎస్, బీజేపీ టిక్కెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లోనూ ఎక్కువగానే ఉన్నప్పటికీ.. పెద్దగా అసమ్మతి బెడద లేకపోవడం సదరు పార్టీలకు ఊరట ఇస్తుంది. ఈ అసమ్మతి పోరుతో పార్టీ అభ్యర్థుల గెలుపు బాటలో అడ్డంకులు వస్తే ఎలా అన్న సంశయంతో అధికార పార్టీ నాయకులు తర్జనభర్జన పడుతున్నారు.
పార్టీ.. నామినేటెడ్ పోస్టులు
అధికార కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ను కట్టడి చేయడానికి పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల తాయిలాలను కీలక నేతలు ఎర వేస్తున్నారు. కొంత మంది రెబల్స్ మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేస్తామని చెప్పడంతో పాటు రానున్న పార్టీలో కీలకమైన పోస్టులు ఇస్తామని ఊరడిస్తున్నారు. ఇలాంటి పదవులు ఇవ్వడానికి అవకాశం లేని చోట్ల పార్టీ తరఫున ఉన్న అభ్యర్థితో రెబల్స్ను బేరసారాలతో మాట్లాడుకోమని చెప్పి బుజ్జగింపులకు దిగుతున్నట్లు సమాచారం. మొత్తం మీద అధికార కాంగ్రెస్ పార్టీకి అసమ్మతి బెడద పెద్ద తలనొప్పిగా తయారైంది.


