
రూటే సప‘రేటు’ఉద్యోగిపై విచారణ
● మెట్పల్లి మండల పరిషత్లో జెడ్పీ సీఈవో విచారణ ● కార్యదర్శులతో సమావేశమై వివరాలు ఆరా.. ● ఆయనను బదిలీ చేయాలని తేల్చిచెప్పిన కార్యదర్శులు
మెట్పల్లిరూరల్: పంచాయతీ కార్యదర్శులను పలు పనుల విషయాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్న మెట్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ అసిస్టెంట్ నవీన్పై అధికారులు విచారణ చేపట్టారు. సదరు ఉద్యోగి ఇబ్బందులు పడలేక కొందరు కార్యదర్శులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ‘సాక్షి’ ఈనెల 22న ‘ఆయన రూటే సపరేటు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి మెట్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో బుధవారం సమావేశమయ్యారు. ఒక్కో కార్యదర్శిని పలు విషయాలపై అడిగి తెలుసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్తో ఇబ్బందులు ఎదుర్కొన్న కొందరు జెడ్పీ సీఈవోకు పూర్తి విషయాలను వివరించారు. ఆయనను బదిలీ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. విచారణకు హారైన కార్యదర్శులంతా ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని లిఖితపూర్వకంగా రాసిచ్చినట్లు సమాచారం. ప్రతి పనిలోనూ ఉద్దేశపూర్వకంగా కార్యదర్శులను ‘ముప్పుతిప్పలు’ పెట్టిన సబ్ ట్రెజరీ కార్యాలయంలోని మరో ఉద్యోగి విషయంపై మాత్రం అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. సదరు ఉద్యోగితో కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కారణంగా ఆయనపైనా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.