
యూజీడీపై ఆశలు
● రూ.400 కోట్ల అంచనాలతో డీపీఆర్ సిద్ధం ● నిధులు మంజూరుకు కేంద్రానికి ఎమ్మెల్యే వినతి ● పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు ఎంతో మేలు
జగిత్యాల:
జిల్లా కేంద్రం.. లక్షకు పైగా జనాభా. 48 వార్డులు.. గ్రేడ్–1 మున్సిపాలిటీ కావడంతో జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) అత్యంత ఆవశ్యకంగా మారింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికినీరంతా రోడ్లపైనే పారుతూ అస్తవ్యస్తంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీకి బీజం పడినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు రూ.400 కోట్ల అంచనాలతో డీపీఆర్ను అధికారులు తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపితే అనుమతి రాగానే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల నిజామాబాద్ ఎంపీ అర్వింద్తో కలిసి ఎమ్మెల్యే సంజయ్కుమార్ కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ను కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంతోపాటు, యూఐడీఎఫ్ పథకం కింద ఎస్టీపీ సీవరేజీ ప్లాంట్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు మంజూరైతే జిల్లా కేంద్రంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు కార్యరూపం దాల్చ నుంది.
2017లోనే బీజం..
జగిత్యాల జిల్లాగా మారిన అనంతరం జిల్లాకేంద్రంతోపాటు మెట్పల్లి, కోరుట్ల, మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని అనివార్య కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం మారిన అనంతరం మళ్లీ యూజీడీ వ్యవస్థ ముందుకు వచ్చింది. గతంలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు యూజీడీ రూపకల్పనకు హైదరాబాద్కు చెందిన యూటర్న్ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఇందుకు రూ.25లక్షలు కూడా కేటాయించారు. అయినప్పటికీ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం మళ్లీ ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం.. డీపీఆర్ రూ.400 కోట్లతో సిద్ధం చేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనికి అధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ఢిల్లీలోని కేంద్రమంత్రితో పాటు, కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ను కలిసి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, ఎంపీ అర్వింద్తో కలిసి కోరారు.
జగిత్యాల వ్యూ
యూజీడీతో మారనున్న రూపురేఖలు
జిల్లా కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తి అస్తవ్యవస్తంగా మారింది. వర్షకాలం ఇళ్లలోకి నీరు చేరుతోంది. జిల్లాకేంద్రం కావడంతో చాలా గ్రామాలు ఇందులో విలీనమయ్యాయి. అయితే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మించలేదు. జగిత్యాల సుమారు 5 నుంచి 6 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. లక్షకు పైగా జనాభా ఉన్నా.. యూజీడీ లేకపోవడం గమనార్హం. ఒకవేళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి వస్తే సిటీ సుందరంగా రూపుదిద్దుకుంటుంది.
యూజీడీ మంజూరుకు కృషి
జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం చర్యలు తీసుకుంటున్నాం. రూ.400 కోట్ల అంచనాలతో డీపీఆర్ సిద్ధం చేశాం. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే యూజీడీ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాం.
– సంజయ్కుమార్, ఎమ్మెల్యే

యూజీడీపై ఆశలు

యూజీడీపై ఆశలు

యూజీడీపై ఆశలు