
రాజ్యాంగంతోనే పౌరులకు హక్కులు
● మాజీమంత్రి జీవన్రెడ్డి ● బీర్పూర్లో జైబాపు, జైభీం, జైసంవిధాన్
సారంగాపూర్: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతోనే ప్రతిపౌరుడు హక్కులను స్వేచ్ఛగా పొందగలుగుతున్నాడని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. సోమవారం బీర్పూర్ మండలకేంద్రంలో జైబాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగప్రతులతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. దేశాన్ని ఏలుతున్న బీజేపీ రాజ్యాంగానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తోందన్నారు. పదేళ్లలో బీర్పూర్లో ఒక్క ఇల్లు కూడా కట్టించలేనోడు ఇప్పుడు కాంగ్రెస్ ముసుగు వేసుకుని.. బీజేపీ బాటలో పయనిస్తూ గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, సీసీ రోడ్లు, ఇతర పనులను తన అనుయాయులకే కట్టబెడుతున్నాడని, పదేళ్లపాటు పార్టీని కాపాడిన కార్యకర్తల పొట్టగొడుతున్నాడని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుందని, ముసుగులో వచ్చే వారిని ప్రజలు గమనించాలని కోరారు. రోళ్లవాగు ప్రాజెక్టుకు ఖరీఫ్ నాటికి మూడు గేట్లు బిగించే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. పరిశీలకులు సంగెనభట్ల దినేష్, మహంకాళి రాజన్న, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, విండో చైర్మన్ పొల్సాని నవీన్రావు, పార్టీ మండల అధ్యక్షుడు చెర్పూరి సుభాష్, గుడిసె జితేందర్, కోండ్ర రాంచంద్రారెడ్డి హాజరయ్యారు.