ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి కృషి
జగిత్యాల: ఎస్సీ, ఎస్టీవర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సబ్ప్లాన్ నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం జగిత్యాల కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి పథకాలపై సభ్యులతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పకుండా పాటించాలని, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అధికారులు సైతం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారికి సంబంధించిన భూములపై కేసులుంటే తక్షణమే పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతినెల చివరి రోజున ఖచ్చితంగా పౌరహక్కుల దినోత్సవం జరిగేలా చూడాలన్నారు. హెడ్కానిస్టేబుల్, ఆర్ఐల ద్వారా సమావేశం నిర్వహిస్తున్నారని, అలా కాకుండా తహసీల్దార్, ఎస్సైలు పాల్గొనాలన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ, ధర్మపురిలోని గాదెపల్లిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, వాటిని కాపాడే దిశగా చూడాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు విద్యనందించాలనే ఉద్దేశంతో బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న విద్యాహక్కు చట్టం అమలయ్యేలా చూడాలని అన్నారు. భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్లు బీసీలకు 25, మైనార్టీలకు 4, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10 సీట్లు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని తెలిపారు. కమిషన్ సభ్యులు లీలాదేవి, శంకర్, రాంబాబునాయక్, లక్ష్మీనారాయణ, ఎస్పీ అశోక్కుమార్, అదనపు కలెక్టర్ లత, సంక్షేమాధికారి రాజ్కుమార్ పాల్గొన్నారు.
కమిషన్ దృష్టికి పలు సమస్యలు
● జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్కు చెందిన వీఆర్ఏ ఎన్నికల విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నా ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సైతం ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించిందన్నారు. కానీ ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థ రద్దు అయిందని, అన్ని అర్హతలు ఉండి కూడా దళితునికి ఉద్యోగం రాకపోవడం బాధాకరమన్నారు.
● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యాభ్యాసం కొనసాగించిన రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన దళిత యువతి ఐఈఆర్సీ రాత పరీక్ష రాసి ఉత్తమ ర్యాంక్ సాధించినప్పటికీ ప్రస్తుతం జగిత్యాల జిల్లాగా మారడంతో నాన్ లోకల్ అంటూ ఉద్యోగం ఇవ్వడం లేదన్నారు. హైకోర్టు సైతం ఉద్యోగం ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అది అమలు కావ డం లేదన్నారు. కమిషన్ చైర్మన్ స్పందించి ఈ రెండు సమస్యలను పరిష్కరించేలా చూస్తామని, అలాగే విద్యాహక్కు చట్టంపై సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
సబ్ప్లాన్ నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య


