పుతిన్‌పై వ్యూహాత్మక దాడి.. ప్లాన్‌ బీ అమలులో ట్రంప్‌, జెలెన్‌స్కీ! | Zelenskyy claims Russian ongoing Easter truce | Sakshi
Sakshi News home page

పుతిన్‌పై వ్యూహాత్మక దాడి.. ప్లాన్‌ బీ అమలులో ట్రంప్‌, జెలెన్‌స్కీ!

Apr 20 2025 7:38 AM | Updated on Apr 20 2025 7:38 AM

Zelenskyy claims Russian ongoing Easter truce

కీవ్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఉక్రెయిన్‌ జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు చేశారు. పుతిన్‌ చెప్పుదొకటి.. చేసేదొకటి అని మండిపడ్డారు. ఈస్టర్‌ సందర్భంగా కాల్పులు విరమణ పాటిస్తున్నామంటూనే.. రష్యా సైన్యం కాల్పులు జరిపిందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. కాల్పులు విరమణ విషయంలో రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. దీంతో, క్రెమ్లిన్‌ కీలక ప్రకటన చేసింది.

ఈస్టర్‌ కాల్పులపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తాజాగా స్పందిస్తూ..‘కాల్పులు విరమణ పాటిస్తామన్న రష్యా తమ మాట నిలబెట్టుకోలేదు. ఈస్టర్‌ సందర్భంగా కూడా దాడులు చేసింది. రష్యా సరిహద్దు ప్రాంతాలైన కుర్స్క్, బెల్గోరోడ్లలో రష్యా సైన్యం కాల్పులు జరిపింది. శనివారం సాయంత్రం నుండి 30 గంటల ఈస్టర్ కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత రష్యా దాడులు చేయడమేంటి?. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే కీవ్‌, ఇతర ప్రాంతాలలో వైమానిక దాడి సైరన్లు వినిపించాయి. ఇది రష్యా చర్యలకు అద్దం పడుతుంది. నిశ్శబ్దానికి ప్రతిస్పందనగా నిశ్శబ్దం, దాడులకు ప్రతిస్పందనగా రక్షణాత్మక దాడులు ఉంటాయి’ అని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. 30 రోజుల పూర్తి కాల్పుల విరమణ కోసం అమెరికా మద్దతుతో కూడిన ప్రతిపాదనకు ఉక్రెయిన్ ముందుగా అంగీకరించింది, దానిని రష్యా తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా, యుద్ధం విషయంలో చర్చలు ఓ కొలిక్కి రాకపోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ విరమణ చేయించాలన్న తన ప్రయత్నాలకు ఆ రెండు దేశాలు సహకరించడంలేదని తెలిపారు.

ఇదే సమయంలో.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో పురోగతి ఏమీ కనిపించకుంటే.. ఆ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము విరమించుకుంటామని అమెరికా ప్రకటన వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ స్పందించింది. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని.. ఈ దిశగా త్వరలో ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొంది. తమ స్వంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి.. కీవ్‌, అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. ఈ చర్చలు చాలా క్లిష్టమని అంగీకరించినప్పటికీ.. వాటిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ అధినేత పుతిన్‌కు మధ్య ప్రస్తుతం ముందస్తు సమావేశాలు లేవని.. కానీ అవసరం అయితే వెంటనే సమావేశమవుతామని తెలిపారు. అలాగే, ఈ ఘర్షణ విషయంలో ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావట్లేవని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement