మధ్యప్రాచ్యంలో చాలా ప్రాంతాలు మదర్స్ డేను (మార్చి 21) ఘనంగా జరుపుకుంటున్న వేళ, గాజాలో (పాలస్తీనా) మాత్రం తల్లులు తమ కోల్పోయిన పిల్లలను గుర్తు చేసుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. పిల్లలు తమ తల్లులు లేని మదర్స్ డేను ఎదుర్కొన్నారు.
గాజాలో మదర్స్ డే తల్లులు, పిల్లలకు శోకదినంగా మారింది. సమాధుల వద్ద తల్లులు తమ పిల్లల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గడిపిన వైనం ప్రపంచం మొత్తాన్ని కంటితడి పెట్టిస్తుంది. యుద్ధం (ఇజ్రాయెల్తో) కారణంగా గాజా మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్న బాధ అంతర్జాతీయ సమాజానికి గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. పిల్లలను కోల్పోయిన తల్లుల ఆక్రందనలు ప్రపంచం నలుమూలలకు వినపడుతూ ఉన్నాయి.
శవాలు కూడా అప్పగించలేదు..!
గాజా సిటీలోని ఒక టెంట్లో కూర్చున్న ఎమ్ రామి దావ్వాస్ అనే మహిళ తన ముగ్గురు కుమారులను ఇజ్రాయెల్ దాడుల్లో కోల్పోయిన జ్ఞాపకాలను పంచుకుంది. వారిలో ఇద్దరి శరీరాలను ఇప్పటికీ తమకు అప్పగించలేదని వాపోయింది. మదర్స్ డే రోజున నా కుమారులు నాకు పూలు, బహుమతులు తెచ్చేవారు. వారు నా జీవితానికి వెలుగులు అనుకుంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యింది.
వెక్కివెక్కి ఏడ్చింది..!
14 ఏళ్ల మారమ్ తన తల్లిని ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కోల్పోయింది. నాకు డబ్బు లేకపోయినా, తల్లికి చిన్న బహుమతి కొనేదాన్ని అని గుర్తు చేసుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది.
64,000 మంది పిల్లల మృతి
UNICEF అంచనాల ప్రకారం, 2023 అక్టోబర్ నుండి గాజాలో 64,000 మంది పిల్లలు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. Amnesty International నివేదిక ప్రకారం, ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో మహిళలు, పిల్లలే అధికం. యుద్దం కారణంగా గాజాలో ప్రసూతి, మాతృ, శిశు ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
సీస్ ఫైర్ తర్వాత కూడా దాడులు
గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ సీస్ ఫైర్ ప్రకటించింది. అయినా దాడులు కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా పాలస్తీనా వ్యాప్తంగా ఇప్పటివరకు 72,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.


