హర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. శత్రువులను ఓడించడానికి తమ దేశ నౌకలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు.
ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఇరాన్ హర్ముజ్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీం లీడర్ మెజ్తాబా ఖమేనీ పేరిట ఈ రోజు (శనివారం) ఒక ప్రకటన విడుదలైంది.
మోజ్తాబా ఖమేనీ ప్రకటనలో " అమెరికా దళాలను ఓడించేందుకు ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉంది. శత్రువులకు కొత్త రకమైన ఓటమిని రుచి చూపిస్తాం". అని హెచ్చరించారు. కాగా యుద్దం ప్రారంభమైన నాటి నుంచి మోజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. కేవలం ఆయన పేరు మీద ప్రకటనలు మాత్రమే విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర స్థాయిలో గాయపడ్డారని, ఆయన ముఖం వికారంగా మారిందని ప్రచారం జరిగింది.
ఇరాన్- అమెరికా మధ్య సయోధ్య కుదురుతుందనే నేపథ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్.. ఒక రోజు గడవకముందే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్లో సోమవారం జరగనున్న చర్చలలో ఏం జరగనుందా అనే టెన్షన్ నెలకొంది.


