అమెరికాకు చెందిన ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ స్పిరిట్ ఎయిర్లైన్స్ (Spirit Airlines) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పెరిగిన ఇంధన ధరలు, భారీ అప్పుల కారణంగా ఈ సంస్థ నేటి నుండే తన కార్యకలాపాలను నిలిపివేసే దిశగా పయనిస్తోంది.
CBS న్యూస్ రిపోర్ట్ ప్రకారం అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో జెట్ ఇంధన ధరలు పెరగడం వల్ల, రాబోయే రుణ చెల్లింపులు చేయగల సామర్థ్యం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విమానయాన సంస్థ రుణదాతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ నివేదిక పేర్కొంది.
త్వరలోనే మూత పడుతుందా?
అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. 2026లో గాలన్ ఇంధనం ధర 2.24 cగా ఉంటుందని కంపెనీ అంచనా వేయగా, ప్రస్తుతం అది 4.24 డాలర్లకు చేరింది. ఇది కంపెనీ అంచనాల కంటే రెట్టింపు. దీనికి తోడు భారీగా పేరుకుపోయిన అప్పులు తీర్చగల కంపెనీ సామర్థ్యంపై రుణదాతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంస్థను లిక్విడేట్ (ఆస్తులు విక్రయించి మూసివేయడం) చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.రుణదాతలతో జరుగుతున్న చర్చల ఫలితాన్ని బట్టి ఈ వారం లోపే కంపెనీ భవిష్యత్తుపై స్పష్టత రానుంది.
ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
దివాలా ప్రక్రియ (Bankruptcy)
స్పిరిట్ ఎయిర్లైన్స్ ఇప్పటికే రెండుసార్లు దివాలా రక్షణ కోరింది. గత ఏడాది ఆగస్టులో 214 విమానాలతో రెండోసారి దివాలా దరఖాస్తు చేసింది. సంస్థను బతికించుకునే ప్రయత్నంలో భాగంగా విమానాల సంఖ్యను భారీగా తగ్గించాలని (సుమారు 80 జెట్లకు) నిర్ణయించింది. ఇది గతంలో ఉన్న విమానాల సంఖ్యలో మూడింట ఒక వంతు మాత్రమే.
ఇదీ చదవండి: టీసీఎస్ కేసు : మతమార్పిడి ఆరోపణల్లో సంచలన సాక్ష్యం
ప్రయాణికులకు హెచ్చరిక
ప్రస్తుతానికి స్పిరిట్ ఎయిర్లైన్స్ టిక్కెట్లు విక్రయిస్తున్నప్పటికీ, నిపుణులు ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు కంపెనీ కార్యకలాపాలు ఎప్పుడైనా హఠాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రయాణికులు ముందే 'బ్యాకప్ ప్లాన్' సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.
కాగా ఒకప్పుడు 200 పైగా విమానాలతో వెలిగిన ఈ సంస్థ, ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతోంది. తక్కువ ధరకే ప్రయాణించే వారు ఎక్కువగా స్పిరిట్ను ఎంచుకునేవారు. ఒకవేళ ఇది మూతపడితే, ఇతర విమాన సంస్థల్లో పోటీ లేక టిక్కెట్ ధరలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: నో ఇంజెక్షన్, రోజుకో పిల్ : యూఏఈ సంచలనం


