
వాషింగ్టన్: జన్యుపరమైన ఒక వ్యాధితో అమెరికాలో చాలామంది పురుషులు మరణించారు. అయితే దానికి సంబంధించిన కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. అయితే ఇటీవలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధిగల కారణాన్ని కనుగొని దీనికి విశాక్స్ అనే పేరుపెట్టింది. సాధారణంగా మన శరీరంలోకి హానికరమైన వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ ప్రవేశించినప్పుడు సహజంగా మన దేహంలో ఉండే వ్యాధి నిరోధక కణాలైన తెల్ల రక్త కణాలు వాటిపై దాడి చేసి వాటిని అంతమొందిస్తాయి.
అయితే ఈ వ్యాధిలో మాత్రం బయట నుంచి ఎలాంటి హాని కలిగించే జీవులు శరీరంలోకి ప్రవేశించనప్పటికి ఈ కణాలు యుద్దాన్ని చేస్తూ మన శరీరంపైనే దాడిచేసి మంటను రగిలిస్తాయి. దాని వలన నరాల్లో రక్తం గడ్డకట్టడం, తరచు జ్వరం రావడంలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వ్యాధి సోకిన వారిలో అదేమిటో వైద్యులు సరిగా గుర్తించలేకపోయేవారు. ఆ వ్యాధి సోకిన వారిలో 40శాతం మంది మరణిస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన 25వేలమందికి పైగా ప్రయోగాలు చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది యూబీఏ1 అనే జన్యువులో మార్పు కారణంగా కలుగుతుందని నిపుణులు పేర్కొన్నారు. చదవండి: ఇంటికి పిలిపించి కుక్కతో కరిపించాడని..