ఆందోళనకారులపై మిలటరీ అవసరం లేదు
ఒట్టోవా: దేశంలో జరుగుతున్న టీకా వ్యతిరేక నిరసనలపై మిలటరీని ప్రయోగించాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదని కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో అభిప్రాయపడ్డారు. నిరసనలపై మిలటరీ ప్రయోగం సహా అన్ని మార్గాలను ఆలోచిస్తున్నామని గతంలో పోలీసులు చెప్పారు. అయితే ట్రూడో మాత్రం ఇప్పట్లో ఆ అవసరం లేదన్నారు. వ్యాక్సినేషన్కు, కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా వేలాది మంది జరుపుతున్న నిరసనలతో కొన్ని వారాలుగా కెనెడా సతమతమవుతోంది.
ట్రూడో ప్రభుత్వం వైదొలగాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. వీరికి ట్రంప్ లాంటి వారి మద్దతు కూడా లభించింది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వాలు సాయం కోరితే అప్పుడు మాత్రమే మిలటరీ ఉపయోగంపై ఆలోచిస్తామని ట్రూడో తెలిపారు.