టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్, కెనడా జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించింది.
ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (56 బంతుల్లో 95 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సెంచరీకి 5 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మిగతా వారిలో సెదిఖుల్లా అటల్ (44), రహ్మానుల్లా గుర్బాజ్ (30) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.
గుల్బదిన్ నైబ్ (1), అజ్మతుల్లా ఒమర్జాయ్ (13) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దర్విష్ రసూల్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెనడా బౌలర్లలో జస్కరన్ సింగ్ 3 వికెట్లు తీయగా.. దిలన్ హేలిగర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కెనడా తడబడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా (13), నవ్నీత్ ధలివాల్ (0) ఔట్ కాగా.. యువ్రాజ్ సమ్రా (17), హర్ష్ ఠాకూర్ (1) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్, ఒమర్జాయ్కు తలో వికెట్ దక్కింది.
కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే సూపర్-8 బెర్త్లు ఖరారైపోయాయి. ఆఫ్ఘన్, కెనడా జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8కు చేరాయి.


