జపాన్‌ వీసా పాలసీ.. భారతీయుడికి తీవ్ర కష్టాలు | japan deportation threat leaves indian resident in tears | Sakshi
Sakshi News home page

జపాన్‌ వీసా పాలసీ.. భారతీయుడికి తీవ్ర కష్టాలు

May 16 2026 7:23 PM | Updated on May 16 2026 7:33 PM

japan deportation threat leaves indian resident in tears

జపాన్‌లో నూతనంగా తీసుకవచ్చిన వీసా నిబంధనలు అక్కడే స్థిరపడిన విదేశీయుల పట్ల శాపంగా మారాయి. గత 30 ఏళ్లుగా జపాన్‌లో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్న ఓ భారతీయునికి అక్కడి అధికారులు వీసా పునరుద్ధరణకు నిరాకరించారు. దీంతో ఆయన ఏం చేయాలో తోచక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 

భారత్‌కు చెందిన మనీష్ కుమార్ గత 30 ఏళ్లుగా జపాన్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడి సైతామా ప్రిఫెక్చర్‌ ప్రాంతంలో గత 18 ఏళ్లుగా ఓ భారతీయ రెస్టారెంట్‌ను నడుపుతున్నారు.   అయితే ఆ దేశంలో ఇటీవల వీసా నిబంధనలు తీవ్ర కఠినతరం చేయడంతో  అధికారులు తన బిజినెస్ మేనేజర్ వీసా పునరుద్ధరణను తిరస్కరించారు. దీంతో 18 ఏళ్లుగా నడుపుతున్న రెస్టారెంట్‌ మూసివేయవలసి వచ్చిందని కన్నీటితో కుప్పకూలిపోయారు.

టోక్యోలో జరిగిన వీసా నిబంధనల  నిరసన ర్యాలీలో మాట్లాడుతూ "రెండు వారాల క్రితం, నా సొంత దేశానికి తిరిగి వెళ్ళమని ఐఎస్ఏ నాకు చెప్పింది. నా పిల్లలు జపాన్‌లోనే పుట్టి పెరిగారు, వారికి జపనీస్ మాత్రమే అర్థమవుతుంది, వారి స్నేహితులు కూడా జపనీయులే. అయినా మమ్మల్ని భారతదేశానికి తిరిగి వెళ్ళమంటున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి?" అని  కన్నీటీ పర్యంతమయ్యారు. ఈ నిర్ణయంతో తాను తీవ్రంగా కుంగిపోయానని, జపాన్‌లో తన కుటుంబ భవిష్యత్తు గురించి భయపడుతున్నానని కుమార్ అన్నారు.

కాగా గతేడాది  జపాన్ తన బిజినెస్ మేనేజర్ వీసా విధానంలో సమూలంగా మార్పులు ప్రవేశపెట్టింది. దీంతో అక్కడే ఉన్న విదేశీ చిన్న తరహా వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా అధికారిక సమాచారం ప్రకారం, అక్టోబర్ 2025లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి వీసా దరఖాస్తులు 96 శాతం తగ్గాయి. నెలవారీ దరఖాస్తులు గతంలో సూమారు  1,700 వరకూ వస్తుండగా ఇప్పుడు  70కి పడిపోయినట్లు సమాచారం.

అయితే అక్కడ నిజమైన వ్యాపారాలు నిర్వహించకుండా, దీర్ఘకాలిక నివాసం కోసం వీసాను సులభ మార్గంగా ఉపయోగించుకునే వారిని అరికట్టడానికే ఈ కఠినమైన నిబంధనలను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement