ఇస్ఫహాన్‌ అణుకేంద్రంపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు  | Israel strikes Iran Isfahan nuclear site | Sakshi
Sakshi News home page

ఇస్ఫహాన్‌ అణుకేంద్రంపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు 

Jun 22 2025 5:00 AM | Updated on Jun 22 2025 6:06 AM

Israel strikes Iran Isfahan nuclear site

ఖుద్స్‌ ఫోర్స్‌ కమాండర్‌ ఇజాదీ సహా ముగ్గురు సీనియర్‌ కమాండర్లు అంతం 

టెల్‌అవీవ్‌లో మొస్సాద్‌ ఆఫీస్‌లపై ఇరాన్‌ క్షిపణుల హోరు

అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన ఇరాన్‌ 

చర్చల కోసం తుర్కియే వెళ్లిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి 

2 వారాల్లో తేల్చకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదన్న ట్రంప్‌ 

గ్వామ్‌ దీవి దిశగా బయల్దేరిన స్టెల్త్‌ బాంబర్‌ విమానం

టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌/దుబాయ్‌/న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: ఇరాన్‌ అణుబాంబు తయారీ క్రతువును కట్టడిచేసేందుకు కంకణం కట్టుకునిమరీ కదనరంగంలోకి దూకిన ఇజ్రాయెల్‌ అదే పనిలో బిజీగా మారింది. ఇరాన్‌లోని ప్రముఖ ఇస్ఫహాన్‌ అణుకేంద్రంపై శనివారం తెల్లవారుజామున ముప్పేట దాడికి తెగించింది. దీంతో న్యూక్లియర్‌ ప్లాంట్‌ పాడైపోయింది. అయితే అణుకేంద్రం నుంచి రేడియోధారి్మకత, విష వాయువులు వెలువడలేదని వార్తలొచ్చాయి. 

వారం క్రితం సైతం యుద్ధం మొదలైన వెంటనే ఇదే ప్లాంట్‌పై ఇజ్రాయెల్‌ స్వల్పస్థాయిలో దాడిచేసింది. ప్లాంట్‌లో ఇంకా కొన్ని అణుబాంబు తయారీకి పనికొచ్చే కీలక పరికరాలు భద్రంగా ఉన్నాయనే అనుమానంతో శనివారం ఇలా మరోసారి దాడిచేసింది. ఇరాన్‌ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ సృష్టించిన ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ)లో విదేశీ విభాగమైన ఖుద్స్‌ ఫోర్స్‌లో సీనియర్‌ కమాండర్లను దాడుల్లో ఇజ్రాయెల్‌ మట్టుబెట్టింది.

 వీరిలో కమాండర్‌ సయీద్‌ ఇజాదీ సైతం ఉన్నారు. ఖ్వామ్‌ సిటీలో జరిగిన దాడిలో ఇజాదీ మరణించారని ఇరాన్‌ సైతం ధ్రువీకరించింది. 2023అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన హమాస్‌కు అన్నిరకాలుగా సాయంచేసిన కమాండర్‌ సయీదేనని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. ఖుద్స్‌ ఫోర్స్‌లో ఆయుధాల తరలింపు యూనిట్‌ కమాండర్‌ అయిన బెహా్నమ్‌ షాహ్రియారీని పశి్చమ ఇరాన్‌లో కారులో ప్రయాణిస్తుండగా దాడి చేసి హతమార్చారు. 

గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన దాడిలో ఇరాన్‌ డ్రోన్‌ విభాగ కమాండర్‌ను సైతం ఇజ్రాయెల్‌ చంపేసింది. ఖుద్స్‌ ఫోర్స్‌ అనేది విదేశాల్లో సైనిక, నిఘా కార్యకలాపాల బాధ్యతలు చూసుకుంటుంది. మహ్వజ్‌లోని క్షిపణి లాంఛర్ల స్టోరేజీ, సైనికస్థావరాలపైనా తమ యుద్దవిమానాలు 50 సార్లు దాడిచేశాయని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) తెలిపింది. దాడుల్లో మరణించిన తమ అణుశాస్త్రవేత్తల సంఖ్య 10కి పెరిగిందని ఇరాన్‌ ఒప్పుకుంది. గతవారం జరిగిన దాడిలో న్యూక్లియర్‌ సైంటిస్ట్‌ ఇసార్‌ తబాతబీ ఘోమ్శే చనిపోయారని పేర్కొంది. 

ఖుజెస్తాన్‌ ప్రావిన్సులో చాలా చోట్ల బాంబుపేలుళ్ల శబ్దాలు వినిపించాయి. హొవేజే సిటీలోని ఎమర్జెన్సీ సెంటర్, అహ్వజ్‌ వైద్య విశ్వవిద్యాలయం పైనా క్షిపణి దాడి చేశారు. దాడుల్లో పశి్చమ ఇరాన్‌లోని సుమార్‌లో ఐదుగురు ఇరాన్‌ సైనికులు చనిపోయారు. ఇంటర్నెట్‌ సేవలు దాదాపు నిలిచిపోవడంతో అసలు దేశంలో ఏం జరుగుతుందో తెలీక ఇరానీలు మరింత భయపడిపోతున్నారు. దేశం నుంచి పారిపోతున్న వారి సంఖ్య పెరిగింది. సరిహద్దులకు దారితీసే రహదారులపై జనం పెద్దసంఖ్యలోకనిపిస్తున్నారు. 

ప్రతిదాడులు చేసిన ఇరాన్‌ 
ఏకబిగిన క్షిపణులను ఎక్కుపెడుతున్న ఇజ్రాయెల్‌పైకి ఇరాన్‌ సైతం బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. ముఖ్యంగా నిఘా సంస్థ మొస్సాద్‌కు చెంది కార్యాలయాలపై దాడులను తీవ్రతరంచేసింది. పెద్దసంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. కొన్నింటిని నేలకూల్చామని ఇజ్రాయెల్‌ బలగాలు తెలిపాయి. అయితే ఇజ్రాయెల్‌ గగనతల రక్షణవ్యవస్థలను చేధించిమరీ డ్రోన్లు లక్ష్యాలను ఢీకొట్టాయి. ఇజ్రాయెల్‌ నగరాలైన బాట్‌ యామ్, టెల్‌ అవీవ్‌లలో దాడుల భయంతో జనం వీధుల్లోకి రావడం మానేశారు. దీంతో చాలా వరకు వీధులు నిర్మానుష్యంగా తయారయ్యాయి. 

ఇరాన్‌ అధ్యక్షుడితో మేక్రాన్‌ ఫోన్‌ మంతనాలు 
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో యూరప్‌ దేశాల విదేశాంగ మంత్రులతో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ బాఘ్చీ శుక్రవారం జరిపిన మధ్యవర్తిత్వ చర్చలు ఎటూ తేలకపోవడంతో ఈసారి వేదికను తుర్కియేకు మార్చారు. ఇస్తాంబుల్‌లో చర్చలు శనివారం రాత్రే మొదలవుతాయని తొలుత వార్తలొచ్చాయి. ఈ యుద్ధంలో అమెరికా జోక్యంచేసుకుంటే పరిణామాలు అత్యంత దారుణంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికా జోక్యంచేసుకుంటే ఎర్రసముద్రంలో అమెరికా రవాణా నౌకలపై దాడులుచేస్తామని యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు శనివారం ప్రకటించారు. 

‘అణు’చర్చలు జరగకూడదనే దురుద్దేశంతోనే ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోందని తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ అన్నారు. మరోవైపు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ఫోన్‌లో మంతనాలు జరిపారు. ఇస్తాంబుల్‌లో మధ్యవర్తిత్వ చర్చలు సఫలీకృతం అయ్యేలా కృషిచేస్తానని మసూద్‌కు మాటిచ్చానని మేక్రాన్‌ చెప్పారు. ప్రాణాలతో బయటపడిన మాజీ సలహాదారు జూన్‌ 13నాటి దాడుల నుంచి ఇరాన్‌ సుప్రీంనేత ఖమేనీ సలహాదారు, మాజీ సెక్యూరిటీ చీఫ్‌ అలీ షామ్‌ఖానీ గాయాలతో తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.

మాటమార్చిన ట్రంప్‌ 
మరికొద్దివారాల్లో అణుబాంబును ఇరాన్‌ తయారుచేసే ప్రమాదం ముంచుకురావడంతోనే ఇజ్రాయెల్‌ దాడులను మొదలెట్టిందని ట్రంప్‌ చెప్పారు. ఇరాన్‌కు అంతటి సామర్థ్యంలేదని మీ నిఘా విభాగమే తేల్చిచెప్పిందని మీడియా ఆయనను ప్రశ్నించగా ట్రంప్‌ కోపగించుకున్నారు. ‘‘ఆ మాట ఎవరన్నారు?’అని ఎదురు ప్రశ్నించారు. నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ మహిళా డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ మార్చినెలలో కాంగ్రెస్‌ ఎదుట ఇదే విషయం చెప్పారని మీడియా గుర్తుచేసింది. దీంతో ట్రంప్‌ వెంటనే ‘‘ఆమె అబద్ధం చెప్పారు. నేను చెప్పిందే నిజం.

 త్వరలో ఇరాన్‌ అణుబాంబు సిద్ధమవుతోంది. అందుకే అప్రమత్తమయ్యాం’’అని దాడులను సమరి్థంచారు. ట్రంప్‌ వ్యాఖ్యల తర్వాత శుక్రవారం తులసీ తన ‘ఎక్స్‌’ఖాతాలో ఒక ట్వీట్‌చేశారు. ‘‘వారాల్లో లేదా నెలల్లో ఇరాన్‌ అణుబాంబు తయారుచేయబోతోందని మాకు సమాచారం అందింది. బాంబుగనక బిగిస్తే ఇక అంతే. అయితే పరిస్థితి అంతదాకా రాకుండా ట్రంప్‌ అడ్డుకుంటారని నాకు తెలుసు’’అని ఆమె ట్వీట్‌చేశారు. 

అంతకుముందు ట్రంప్‌ ఇరాన్‌ను హెచ్చరిస్తూ మాట్లాడారు. ‘‘ఇరాన్‌కు రెండు వారాల గడువు ఇచ్చా. ఆలోపు ఒప్పందం కుదుర్చుకోకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో నాకే తెలీదు’’అని అన్నారు. ఈయన మాటలకు తగ్గట్లు వేల కేజీల బంకర్‌ బస్టర్‌ బాంబును జారవిడిచే బీ2 స్టెల్త్‌ విమానాలు గ్వామ్‌ దీవి దిశగా బయల్దేరినట్లు వార్తాలొచ్చాయి. ఫోర్డో భూగర్భ అణుశుద్ధికర్మాగారాన్ని భూస్థాపితం చేయాలంటే ఈ విమానం నుంచి మాత్రమే జీబీయూ–57 మ్యాసివ్‌ ఆర్డ్‌నెన్స్‌ పెనిట్రేటర్‌ బాంబును పడేయడం సాధ్యమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement