
పరిమిత ఆప్షన్లతో పట్టుసాధిస్తుందా?
చైనా, రష్యా ప్రత్యక్షంగా సాయం చేస్తాయా?
హెజ్బొల్లా, హమాస్, హౌతీ, మిలీషియాలు మద్దతిస్తాయా?
అమెరికా జోక్యంతో ఇరాన్ ముందున్న మెరుగైన మార్గాలెన్ని?
అగ్రరాజ్యం అమెరికా సైతం తమపై కత్తికట్టడంతో ఇప్పుడు ఇరాన్ తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణమొచ్చింది. అయితే ఈ కష్టకాలంలో కాడెత్తేయకుండా కడదాకా తమకు తోడుగా నిలిచే నిజమైన నేస్తలెందరో ఇప్పుడు ఇరాన్ లెక్కబెట్టుకుంటోంది. యుద్ధంలో పైచేయి సాధించేందుకు పనికొచ్చే ప్రత్యామ్నాయాలు ఎన్ని ఉన్నాయో బేరీజువేసుకుంటోంది.
ఇజ్రాయెల్, అమెరికాలకు దీటుగా చైనా, రష్యా ఏమేరకు తనకు సైనిక సాయం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇస్తాయోనని ఇరాన్ సమీక్ష జరుపుతోంది. హోర్ముజ్ జలసంధి మీదుగా చమురు నౌకల రాకపోకలను అడ్డుకుంటే తనకు ఒనగూరే లాభమెంతో లెక్కేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ ముందు ఆప్షన్లు ఎన్ని అనే అంశం ప్రధానంగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
హోర్ముజ్ జలసంధిని ఆపేస్తే?
సముద్రం ద్వారా రావాణా అయ్యే చమురులో దాదాపు 25 శాతం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుండే ఈ జలమార్గం గుండా చమురు, సహజవాయువు రవాణా నౌకలను అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల మంటలు పైకి ఎగిస్తే ప్రపంచార్థికం దెబ్బతినడం ఖాయం.
ఈ భయాలను బూచిగా చూపి తమపై దాడులను ఆపాలని అమెరికా, ఇజ్రాయెల్ కూటమి దేశాలను ఇరాన్ హెచ్చరించే వీలుంది. వేగంగా దూసుకెళ్లే బోట్ల ద్వారా వేలాదిగా మెరైన్ మైన్(సముద్ర మందుపాతర)లను జలసంధి మార్గంలో ఇరాన్ మొహరించిందనే వార్తలు వెలువడ్డాయి. వీటిలో నిజమెంతో ఎవరికీ తెలీదు. అదే నిజమైతే నౌకలు అటు వెళ్లేందుకు వణుకుతాయి.
పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ముప్పేట దాడి?
అమెరికా భూభాగం నుంచి నేరుగా దాడులు చేయడం కష్టం. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తిష్టవేసి ఏర్పాటుచేసుకున్న సమీప స్థావరాల నుంచే అమెరికా దాడిచేయగలదు. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ మెరుపుదాడులు చేసి ప్రతిదాడులను నిలువరించవచ్చు.
ఈ భయంతోనే అమెరికా ఇప్పటికే ఒకటి, రెండు స్థావరాల నుంచి యుద్ధవిమానాలను వేరేచోటుకు తరలించినట్లు ప్రైవేట్ శాటిలైట్ తాజా చిత్రాలతో స్పష్టమైంది. అమెరికా గడ్డపై తమ మద్దతుదారుల ద్వారా పేలుళ్లు జరిపి మారణహోమం సృష్టించే ఛాన్సుంది. అందుకే ఈ విషయంలో అమెరికా ఇప్పటికే అప్రమత్తమై పలు ప్రధాన ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టంచేసిందని వార్తలొచ్చాయి.
పెంచిపోషించిన సాయుధ సంస్థల సాయంతో..
గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హౌతీ రెబల్స్, ఇరాక్లో మిలీషియా సంస్థలకు ఆర్థిక, ఆయుధసాయం చేసి ఇరాన్ తన పరోక్ష సైన్యంగా తీర్చిదిద్దుకుంది. వీటిని ఒకరంగా ప్రతిఘటన దళంగా పేర్కొంటారు. అయితే 20 నెలలుగా ఇజ్రాయెల్తో పోరాడి హమాస్ తన అగ్రనాయకత్వాన్ని కోల్పోయి ఒకరకంగా అలసిపోయింది. హెజ్బొల్లా ఉగ్రసంస్థ పోరాడే వీలుంది.
ఇరాన్తో కలిసి నడుస్తామని మూడ్రోజుల క్రితమే హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఎర్రసముద్రంలో విదేశీ చమురు నౌకలు అడ్డుకుంటామని చెప్పారు. ఇరాక్లోని మిలీషియా సంస్థలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మిలీషియాలు, హౌతీలకు డ్రోన్లు, చిన్నపాటి క్షిపణులను ప్రయోగించడంలో నైపుణ్యముంది. వీళ్లు ఇరాన్కు తోడు నిలిచే అవకాశముంది.
చైనా, రష్యాల పరోక్ష సాయం
చైనా ఇప్పటికే కొన్ని చమురునౌకల ముసుగులో కొన్ని ఆయుధాలను ఇరాన్కు తరలించి సాయపడినట్లు తెలుస్తోంది. యుద్దం తీవ్రతరమైతే తమ చిరకాల మిత్రుడు ఇరాన్కు సాయంగా రష్యా, చైనాలు ముందడుగు వేసే వీలుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పుబట్టారు. ఈ విషయమై ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు.
అణుకార్యక్రమం ఆగకపోవచ్చా?
యురేనియం శుద్ది కర్మాగారాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి, బాంబు దాడులు ఇరాన్ను అణ్వాయుధం తయారుచేయకుండా మరికొన్ని వారాలు, నెలలు అడ్డుకో గలవుగానీ శాశ్వతంగా ఆపలేవని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. న్యూక్లియర్ సెంటర్లలోకాకుండా వేరేచోట్ల యురేనియంను నిల్వచేస్తే అమెరికా, ఇజ్రాయెల్ల పరిస్థితి ఏంటనే అంశం తెరమీదకొచ్చింది. తన దేశ ఉనికి, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితే వస్తే ఇరాన్ ఎంతకైనా తెగిస్తుందనే విశ్లేషణల నడుమ ఈ సమరం ఏ దిశలో పయనిస్తుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది.
– సాక్షి, నేషనల్ డెస్క్