చరిత్ర సృష్టించిన ‘కౌండిన్య’ | INS Kaundinya receives a water salute | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ‘కౌండిన్య’

Jan 14 2026 5:44 PM | Updated on Jan 15 2026 5:04 AM

INS Kaundinya receives a water salute

పోరుబందర్‌ నుంచి విజయవంతంగా ఒమన్‌కు చేరిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య

మస్కట్‌: భారత పురాతన నౌకానిర్మాణ కౌశలంతో ఇంజిన్, ఇనుము లేకుండా కేవలం చెక్క, కొబ్బరి తాళ్లు, జిగురుతో నిర్మితమైన అపురూప, అద్భుత నౌక ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’ తన సత్తా చాటింది. కేవలం గాలివాటానికి అనుగుణంగా పయనించే నౌకను 17 మంది నిష్ణాతులైన సిబ్బంది విజయవంతంగా గమ్యానికి చేర్చారు. కేవలం 17 రోజుల వ్యవధిలోనే పోరుబందర్‌ నుంచి సముద్రయానం మొదలెట్టి ఒమన్‌లోని మస్కట్‌ సముద్రతీర నగరానికి చేరుకుని భారతీయ నావికానిర్మాణ పటిమను ప్రపంచానికి చాటిచెప్పింది. 

భారత్, ఒమన్‌ల మధ్య ప్రాచీన సముద్రయాన రాకపోకలను ఈ నౌక మరోసారి స్మరణకు తెచ్చిందని మస్కట్‌లో భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐదో శతాబ్దంనాటి విఖ్యాత అజంతా గుహల్లోని కుడ్య చిత్రం నుంచి ప్రేరణ పొందిన నిపుణులు, కళాకారుల బృందం 65 అడుగుల పొడవుతో నిర్మించిన ఇండియన్‌ నావల్‌ సెయిలింగ్‌ వెసిల్‌(ఐఎన్‌ఎస్‌వీ) కౌండిన్య బుధవారం విజయవంతంగా మస్కట్‌లోని పోర్ట్‌ సుల్తాన్‌ ఖాబూస్‌కు చేరుకోవడంతో అందులోని నావికులు సంబరాలు చేసుకున్నారు.

నౌకకు ఘన స్వాగతం పలికిన మంత్రి, అధికారులు
మస్కట్‌ నౌకాశ్రయానికి చేరుకున్న ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్యకు భారత పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్‌ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌ ఘన స్వాగతం పలికారు. మస్కట్‌లో భారతీయ రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు, ఒమన్‌ పర్యాటక, వారసత్వ మంత్రిత్వ శాఖ, ఒమన్‌ రాయల్‌ నేవీ అధికారులు ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శర్బానంద మాట్లాడారు. ‘‘ఈ నౌక ప్రయాణం భారతీయ సముద్రయాన ఘన చరిత్ర, వారసత్వాన్ని గుర్తుచేసింది. ఇంజిన్‌లేని నౌకను ధైర్యసాహసాలతో లక్ష్యం దిశగా నడిపించిన నావికాబృందాన్ని చూసి దేశం గర్విస్తోంది.

 భారత్, ఒమన్‌ల ప్రాచీన సముద్రయాన బంధాన్ని ఈ నౌక మరోసారి స్మరణకు తెచ్చింది. కమాండర్‌ ∙హేమంత్‌ కుమార్, కమాండర్‌ వికాస్‌ షేవ్రాన్‌ల సారథ్యంలో మొత్తంగా నలుగురు అధికారులు, 13 మంది నావికుల బృందంతో ఈ నౌక గత ఏడాది డిసెంబర్‌ 29వ తేదీన గుజరాత్‌లోని పోరుబందర్‌ నుంచి బయల్దేరిన విషయం తెల్సిందే. 650 నాటికల్‌ మైళ్ల దూరాన్ని ఎలాంటి అవరోధాల్లేకుండా విజయవంతంగా పూర్తిచేశామని నావికాబృందం ఆనందం వ్యక్తంచేసింది. ప్రయాణం విజయవంతమవడంపై కమాండర్‌ హేమంత్‌ మాట్లాడారు. 

 ‘‘యుద్ధవిమాన వాహకనౌక మొదలు జలాంతర్గాముల దాకా ఎన్నింటినో భారత్‌ తయారుచేసింది. కానీ ఇలాంటి విలక్షణ నౌకను గతంలో తయారుచేయలేదు. అజంతా గుహలో రాతిపై వేసిన పురాతన పెయింటింగ్‌లో అస్పష్ట వివరాలు మినహా నౌక తయారీకి మన దగ్గర ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. కనీసం బ్లూప్రింట్‌ లేదు. అయినాసరే దీన్నో సవాల్‌గా తీసుకుని నిపుణులు తయారుచేశారు. నౌక తయారీలో ఇనుము, మేకులు, ఇంజిన్లను ఉపయోగించలేదు. కొబ్బరి నార తాళ్లను తెరచాపలను కట్టేందుకు ఉపయోగించారు. ఉప్పుమయ సముద్రనీటిలో నౌక అడుగుభాగం పాడవకుండా ఉండేందుకు సహజ జిగురును పూతగా ఉపయోగించారు. కేరళ కళాకారులు నౌక విడిభాగాలను ప్రాచీన విధానంలో అతికించారు’’ అని ఆయన వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement