
న్యూఢిల్లీ: భారత్ ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) చేపట్టిన సమయంలో పాకిస్తాన్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా సంతాపం వ్యక్తం చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నిరాశ వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను ఉసిగొల్పేవారికి, కేవలం తమను తాము రక్షించుకునేవారికి మధ్య ఎటువంటి తేడా ఉండడని శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరాడాలనే భారతదేశ బలమైన సంకల్పాన్ని తెలియజేయడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్తో పాటు పలువురు ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందంతో ప్రస్తుతం కొలంబియా పర్యటనలో ఉంది.
ఈ సందర్భంగా కొలంబియా(Colombia)లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో శశిథరూర్ మాట్లాడుతూ పాక్పై భారత్ ప్రతీకార దాడులు నిర్వహించిన తర్వాత పాకిస్తాన్లో జరిగిన ప్రాణనష్టంపై కొలంబియా సంతాపం వ్యక్తం చేయడంపై నిరాశచెందామని, ఇటువంటి సమయంలో ఉగ్రవాదానికి బలైనవారిపై సానుభూతి వ్యక్తం చేయడం అవసరమన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరుల ఊచకోత వెనుక పాకిస్తాన్ హస్తముందని ప్రభుత్వం వద్ద వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని ఎంపీ పునరుద్ఘాటించారు.
కొలంబియా పలు ఉగ్ర దాడులను ఎదుర్కొన్నట్లే, నాలుగు దశాబ్దాలుగా భారత్ పెద్ద సంఖ్యలో ఉగ్రదాడులను ఎదుర్కొన్నదని శశిథరూర్ అన్నారు. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ గురించి ప్రస్తావించిన ఆయన పాకిస్తాన్ దగ్గరున్న రక్షణ పరికరాలలో 81 శాతం చైనా సరఫరా చేసినవేనని పేర్కొన్నారు. రక్షణ అనేది మర్యాదపూర్వక పదం. అయితే పాకిస్తాన్ తన సైనిక పరికరాలను దాడుల కోసం వినియోగిస్తోందని శశిథరూర్ అన్నారు. ఎంపీ థరూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పనామా, గయానాలను సందర్శించిన అనంతరం కొలంబియాకు చేరుకుంది.
ఇది కూడా చదవండి: పాక్లో మకాం.. సిమ్ల దుర్వినియోగం.. రాజస్థాన్ యువకుడు అరెస్ట్