క్రౌడ్‌స్ట్రైక్ అతలాకుతలం | CrowdStrike crashed global computer systems | Sakshi
Sakshi News home page

క్రౌడ్‌స్ట్రైక్ అతలాకుతలం

Jul 21 2024 5:30 AM | Updated on Jul 21 2024 5:30 AM

CrowdStrike crashed global computer systems

పడిపోయిన షేర్‌ విలువ 

వాషింగ్టన్‌: ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసిన విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం సాంకేతిక సమస్య ఆర్థికంగా కూడా అంతర్జాతీయంగా గట్టి ప్రభావమే చూపింది. పలు దిగ్గజ సంస్థల షేర్ల విలువ తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా తప్పుడు అప్‌డేట్‌తో సమస్యకు కారణమైన సైబర్‌ సెక్యూరిటీ దిగ్గజం క్రౌడ్‌స్ట్రైక్‌కు ఆర్థికంగా గట్టి దెబ్బే తగిలింది. శుక్రవారం ఆ సంస్థ షేర్‌ వాల్యూ ఒక్కసారిగా 11 శాతానికి పైగా పడిపోయింది. 

42.22 డాలర్లున్న ఒక్కో వాటా విలువ 30 డాలర్లకు తగ్గింది. సంస్థ మొత్తం విలువ 83 బిలియన్‌ డాలర్ల పై చిలుకని అంచనా. ఆ లెక్కన 900 కోట్ల డాలర్లకు పైగా హరించుకుపోయినట్టే. అయితే ఆర్థిక నష్టం కంటే కూడా ప్రపంచంలోనే అగ్రశ్రేణి సైబర్‌ సెక్యూరిటీ సంస్థగా క్రౌడ్‌స్ట్రైక్‌కు ఉన్న ఇమేజీకి జరిగిన నష్టమే చాలా ఎక్కువ. 

ఎందుకంటే దాని కస్టమర్లుగా ఉన్న కంపెనీలు, పెద్ద సంస్థల్లో చాలావరకు తమ సైబర్‌ సెక్యూరిటీ బాధ్యతల కోసం ఇతర సైబర్‌ సెక్యూరిటీ సంస్థలవైపు చూస్తున్నట్టు సమాచారం. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికే ఈ జాబితాలో చేరారు. ‘‘మా వ్యవస్థల నుంచి క్రౌడ్‌స్ట్రౌక్‌ను తొలగించేశాం’’ అంటూ ఆయన సోషల్‌ మీడియాలో తాజాగా పోస్ట్‌ చేశారు. సెంటినల్‌ వన్, పాలో ఆల్టో నెట్‌వర్క్‌ వంటి క్రౌడ్ర్‌స్టౌక్‌ ప్రత్యర్థి కంపెనీలు ఈ పరిస్థితిని రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్నాయి. 

భారీ పరిహారాలు! 
మరోవైపు క్రౌడ్‌స్ట్రైక్ కస్టమర్లంతా తమకు జరిగిన నష్టానికి ఆ సంస్థ నుంచి భారీగా నష్టపరిహారం డిమాండ్‌ చేసేలా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజాలు ఆ సంస్థ క్లయింట్ల జాబితాలో ఉండటం తెలిసిందే. షట్‌డౌన్‌ దెబ్బకు వాటి షేర్ల విలువ సగటున ఒక శాతం దాకా పడిపోయినట్టు వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement