వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్‌ విలువను బట్టే పెళ్లి భోజనం

Bride And Groom Offer Food to Wedding Guests Based On Price Of Gift - Sakshi

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన వేడుక. ఈ సందర్భాన్ని జీవితాంతం మర్చిపోలేని మధురానుభూతిగా మార్చుకోవడం కోసం తమ స్థాయికి తగ్గట్లు ఖర్చు పెడతారు. పెళ్లిలో మిగితవన్ని ఒక ఎత్తు అయితే.. విందు ఒక ఎత్తు. రకరకాల పదార్థాలతో వచ్చిన అతిథులకు మంచి విందు ఏర్పాటు చేస్తారు. పెళ్లికి వచ్చినవారు తృప్తిగా భోంచేసి.. తమను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ ఓ జంట పెళ్లికి అతిథులు తెచ్చిన బహుమతి ఖరీదు ఆధారంగా వారికి విందు భోజనం పెడతామని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆహ్వాననోట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..

రెడిట్‌లో ‘బిగ్గర్‌ క్యాష్‌ గిఫ్ట్‌.. బెటర్‌ డిన్నర్‌’ అనే క్యాప్షన్‌తో వైరలవుతోన్న ఈ నోట్‌లో కాబోయే దంపతులు.. తమ వివాహ బహుమతి కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలియజేయమని అతిథులను అడిగారు. గిఫ్ట్‌ కోసం చేసే ఖర్చును బట్టి వారికి డిన్నర్‌లో ఏం ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు సదరు జంట.

ఈ నోట్‌ ప్రకారం సదరు జంట తమ వివాహానికి హాజరయ్యే అతిథులను నాలుగు వర్గాలుగా విభజించారు. ఈ నాలుగు గ్రూప్‌లకు ‘ప్రేమపూర్వక బహుమతి’, ‘బంగారు బహుమతి’, ‘వెండి బహుమతి’, ‘ప్లాటినం బహుమతి’ అని వేర్వేరు పేర్లు పెట్టారు.

పెళ్లికి వచ్చిన అతిథులు తమకిచ్చే బహుమతి విలువ  250 డాలర్లు అయితే, అది 'ప్రేమపూర్వక బహుమతి' కేటగిరీలోకి వస్తుంది. వారికి ఇచ్చే విందులో రోస్ట్ చికెన్‌ లేదా చేపను వడ్డిస్తారు.

అతిథులు కొనుగోలు చేసే బహుమతుల విలువ 251-500 డాలర్ల మధ్య ఉంటే, అది 'సిల్వర్ గిఫ్ట్' కేటగిరీ కిందకు వస్తుంది. వారికి డిన్నర్‌లో భాగంగా మొదటి కేటగిరీలో ఉన్న వంటలు లేదా ముక్కలు చేసిన స్టీక్, సాల్మన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 

అతిథులు కొనుగోలు చేస్తున్న బహుమతుల విలువ 501-1000 డాలర్ల మధ్య ఉంటే, అది 'బంగారు బహుమతి' కేటగిరీ కిందకు వస్తుంది. ఇక వారికి డిన్నర్‌లో మొదటి, రెండవ కేటగిరీ కింద వంటకాలు కలిపి వడ్డిస్తారు. అవి వద్దనుకుంటే ఫైలెట్ మిగ్నాన్, ఎండ్రకాయల తోకలను ఎంచుకోవచ్చు.

అతిథులు కొనుగోలు చేస్తున్న బహుమతుల విలువ 1000 -2500 డాలర్ల లోపు ఉంటే అది 'ప్లాటినం గిఫ్ట్' కేటగిరీ కిందకు వస్తుంది. ఇక వారికి డిన్నర్‌లో మొదటి, రెండవ, మూడో కేటగిరీ కింద వంటకాలు వడ్డిస్తారు. వద్దనుకుంటే ఎండ్రకాయతో పాటు సావనీర్ షాంపైన్ గోబ్లెట్‌ని వడ్డిస్తారు.

ప్రస్తుతం ఈ నోట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. మీరు భారతీయులై ఉండి.. ఇలాంటి రూల్స్‌ పెడితే.. మీ పెళ్లికి మీరిద్దరే తప్ప వేరే బంధువులు ఎవరు రారు.. అయినా గిఫ్ట్‌ని బట్టి భోజనం పెట్టడం ఏంటి అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

చదవండి:
వర్క్‌ ఫ్రం.. వెడ్డింగ్‌!
పెళ్లి చేసుకోవాల్సిన ఈ వధూవరులు ఏం చేస్తున్నారో తెలుసా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top