పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య | 13 People Died After Drinking Poisoned Milk | Sakshi
Sakshi News home page

పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య

Sep 14 2024 12:01 PM | Updated on Sep 14 2024 12:26 PM

13 People Died After Drinking Poisoned Milk

కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. భూవివాదాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషమిచ్చి హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మృతులను గుల్ బేగ్ బ్రోహి, అతని భార్య, ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మరో ముగ్గురు బంధువులుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ పెద్దకు కొందరితో భూవివాదం ఉన్నదని పోలీసుల దర్యాప్తులో తేలింది. సకూర్‌లోని కెమికల్‌ లేబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లో కుటుంబ సభ్యులు మృతిచెందిన రోజు తాగిన పాలలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వెల్లడయ్యిందని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాల్లో విషపదార్థాలు ఉన్నట్లు కూడా నివేదికలో నిర్ధారణ అయ్యిందన్నారు.

ఖైర్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) డాక్టర్ సమీవుల్లా సూమ్రో మాట్లాడుతూ పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనకు బాధ్యులైనవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని సమీవుల్లా సూమ్రో తెలిపారు.

ఇది కూడా చదవండి: Ghaziabad: పండ్ల రసాల్లో మూత్రం కలిపిన వ్యాపారి అరెస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement