సాక్షి, సిటీబ్యూరో: భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. మహా నగరంలో సాధారణం కంటే మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల నమోదవుతుండటంతో జనం అల్లాడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఉష్ణతాపం కనిపిస్తోంది. 10 గంటల తర్వాత బయటకు వెళ్లలేని పరిస్థితి. అత్యవసర పనులపై బయటకు వెళ్లినవారు వడగాలులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు వడదెబ్బ బారినపడుతున్నారు. శివారులో సగటున గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటగా.. నగరం మాత్రం 42 పైనే రికార్డు అవుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు.