
సనత్నగర్: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సిటీకి వస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయన రాజ్భవన్కు చేరుకుని అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం మోదీ రాజ్భవన్ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్టుకు..అక్కడి నుంచి జగిత్యాలకు వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో (నేడు, రేపు) ఆయన వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 7.40 నుంచి 8.10 గంటల మధ్య ప్రధానమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్భవన్కు చేరుకుంటారు. ఈ సమయంలో ఎయిర్పోర్ట్ వై జంక్షన్, పీఎన్టీ ఫ్లైఓవర్ కింద కుడి మలుపు, షాపర్స్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్ల్యాండ్స్ వద్ద ఎడమ మలుపు, రాజీవ్గాంధీ విగ్రహం, మోనప్ప ఐలాండ్ జంక్షన్, యశోద హాస్పిటల్, ఎంఎంటీఎస్, రాజ్భవన్ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు. అలాగే సోమవారం ఉదయం 9.50 నుంచి 10.15 గంటల మధ్య ప్రధానమంత్రి రాజ్భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారని తెలిపారు. వాహనదారులు ఆయా సమయాలను గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలన్నారు.