
● లబ్ధిదారుల ఎంపికకు విధి విధానాలు ఖరారు కాలేదు
● ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ మాత్రమే
● త్వరలో ఆన్లైన్ ద్వారా సదుపాయం
● ఇళ్లు లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చు
● మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలకు అనుగుణంగా అభయహస్తం కింద ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కింద దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. గ్రేటర్ నగరంలో కార్యక్రమం అమలుకు సంబంధించి ఇక్కడి బంజారా భవన్లో అధికారులు, టీం లీడర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. చివరి దరఖాస్తుదారు వరకు అందరి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఏవైనా కారణాల వల్ల ఇవ్వలేకపోయిన వారికి చివరి రోజు అవకాశం కల్పిస్తామన్నారు. బుధవారం దరఖాస్తు ఫారాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్ది రిలీజ్ చేస్తారని, దాన్ని చూశాక ఏవైనా సందేహాలుంటే తీరుస్తామన్నారు. ప్రజాపాలన అమల్లో భాగంగా ఇదో ప్రయత్నమని, ఇప్పటి వరకు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు అవస్థలు పడ్డారన్నారు.
ఏవి కావాలో ఎంపిక చేసుకోవాలి..
ఆరు గ్యారంటీల అమలు కోసం డేటా సేకరణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని, లబ్ధిదారుల ఎంపికకు ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని వెల్లడించారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూం ఇళ్లు రాని వారు తమ ఇందిరమ్మ పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే పెన్షన్లు పొందుతున్నవారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దరఖాస్తులో గ్యారంటీలకు సంబంధించిన పథకాలు ఉంటాయని, అర్హులైన వారు వాటిల్లో తమకు ఏవి కావాలో వాటిని ఎంపిక చేసుకోవాలన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తును త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఎవరు సలహాలిచ్చినా స్వీకరిస్తామని, తమది ప్రజల భాగస్వామ్యంతో నడిచే ప్రజా ప్రభుత్వమన్నారు.
నేడు స్థానిక ప్రజాప్రతినిధులతో..
● బుధవారం నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కూడా సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రజాపాలన కార్యక్రమం రాజధాని నగరంలో విజయవంతమై అన్ని ప్రాంతాలకు మార్గదర్శకం కావాలన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు రాజధాని దాకా ప్రజా దర్బార్కు రాకుండా ఉండేందుకే ప్రజా పాలనను అమలు చేస్తున్నామన్నారు.
● నగరంలోని ఆరు జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డుల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతివార్డులో నాలుగు లొకేషన్లలో కార్యక్రమం ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు. మొత్తం 600 లొకేషన్లలో ఏ రోజు, ఏ పూట, ఏ వార్డులో ఈ కార్యక్రమం జరుగుతుందో ముందస్తుగా ప్రజలకు సమాచారం తెలిసే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఒక్కో టీమ్లో లీడర్తో సహా ఎనిమిదిమంది సభ్యులుంటారన్నారు. దరఖాస్తులు కూడా ఇళ్లకే వెళ్లి అందజేస్తారని, వాటిని నింపి, ప్రజాపాలన శిబిరంలో అందజేస్తే రసీదులిస్తారన్నారు.
● మహిళలు, వికలాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక లైన్లు ఉంటాయన్నారు. దరఖాస్తు నింపడంలో ఇబ్బందులున్న వారి కోసం, సందేహాల నివృత్తి కోసం ప్రతి సెంటర్లో ప్రత్యేక కౌంటర్లుంటాయన్నారు. చాలా రోజుల తర్వాత ప్రజాస్వామిక పద్ధతిలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.
రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం
శ్వేతపత్రాలు, స్వేదపత్రాలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు తమ సూచనలివ్వాల్సిందిగా కోరారు. దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల్లో తాగునీటితో సహా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఒక్కో కేంద్రంలో పదిమంది చొప్పున ఆరువేల మంది వలంటీర్లు ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సహకరిస్తారన్నారు. తమ హామీల అమలులో భాగంగా ఇప్పటికే నాలుగుకోట్ల మంది మహిళలు ఉచితబస్సు సదుపాయాన్ని వినియోగించుకున్నారని, ఇబ్బందుల్లేకుండా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపరచేందుకు కొత్తబస్సులు తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
కొత్త రేషన్కార్డులిస్తాం
రేషన్కార్దులిచ్చే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. రేషన్కార్డుల్లో సభ్యుల చేర్పులు, తొలగింపులు గత పదేళ్లుగా జరగలేదని వాటికి కూడా అవకాశం ఉంటుందన్నారు. దరఖాస్తుతోపాటు కేవైసీ వంటివి ఉండవన్నారు. గతంలో అనర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందినట్లు ఫిర్యాదులందితే పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా పొన్నం పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా ఇప్పటి వరకు దాదాపు 22వేల దరఖాస్తులందాయన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.