
ఎల్లూరి శివారెడ్డికి డాక్టర్ సీనారె పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న దృశ్యం
సుల్తాన్బజార్: పద్మభూషణ్ డాక్టర్ సీ.నారాయణరెడ్డి లాంటి గొప్ప వ్యక్తులను భావితరాలు అనుకరించి అనుసరించాలని శాంతా బయాటిక్స్ అధినేత పద్మభూషణ్ డాక్టర్ కేవి.వరప్రసాద్రెడ్డి అన్నారు. జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సీ.నారాయణరెడ్డి 92వ జయంతి ఉత్సవాలు రసమయి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కేవీ.వరప్రసాద్రెడ్డి తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి సీనారె పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురుపూర్ణిమ రోజు డాక్టర్ సీనారె జన్మించడం అరుదైన సందర్భమన్నారు. తెలుగు భాష అందాలను తన రచనల రూపంలో అందించిన గొప్ప వ్యక్తి సీనారె అన్నారు. ఆయన ఎన్నో సినిమాలకు పాటలు రాసి ప్రేక్షకులను మెప్పించారని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కవి సామ్రాట్ డాక్టర్ తిరుమల శ్రీనివాసచార్య, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, ఎంకేఆర్.ఆశాలత, రసమయి అధ్యక్షులు డాక్టర్ ఎంకే.రాము, నిర్వాహకులు జె.నర్సింహారావులతో పాటు సాహితీ ప్రియులు పాల్గొన్నారు. అంతకు ముందు డాక్టర్ సీనారె రాసిన గీతాలను కళాకారులు ఆలపించారు.