కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీలో అయోధ్యపురం భూ నిర్వాసితులు, గ్రామస్తులకు, కాజీపేట పరిసర ప్రాంతాల వారికి, రైల్వే ఆక్ట్ అంప్రెంటీస్ చేసిన వారికి, ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అన్నారు. కాజీపేట రైల్వే ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవేందర్ మాట్లాడుతూ.. ఆదివారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ ఎదుట రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో మహా నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. రైల్వే జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు మాట్లాడుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని రైల్వే జేఏసీ చేపడుతున్న డిమాండ్లు నెరవేరే వరకు అందరి సహకారం ఉండాలన్నారు. కాజీపేట డివిజన్ కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, రైల్వే జేఏసీ దీక్షను అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైల్వే జేఏసీ బృందం పాక వేద ప్రకాశ్, గుర్రపు సుధాకర్రావు, వస్కుల రవీందర్, వల్లపు తిరుపతి, జి.భాస్కర్, జి.నాగరాజు, శిరుమల్ల రమేశ్ పాల్గొన్నారు.
రైల్వే జేఏసీ కన్వీనర్ రాఘవేందర్
నేడు రైల్వే జేఏసీ మహా నిరసన దీక్ష


