సాక్షిప్రతినిధి, వరంగల్/నెట్వర్క్ : సర్కారు బడి సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు ప్రైవేట్తో పోటీ పడలేక.. మరోవైపు మౌలిక వసతుల లేమితో సతమతమవుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. బడిబాట, ఉపాధ్యాయుల ప్రచారాన్ని నమ్మి పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్య అందడం లేదు. చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. పారిశుధ్యం లోపించింది. కొన్ని పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని విద్యార్థుల్లేక మూతబడ్డాయి. ఇంకొన్ని చోట్ల విద్యార్థులున్నప్పటికీ చదువు చెప్పే వారు లేరు. పలు చోట్ల మధ్యాహ్న భోజనం అస్తవ్యస్తంగా మారింది. ఇలా.. గ్రేటర్ పరిధిలోని ప్రతీ పాఠశాలను ఏదో ఒక సమస్య వేధిస్తున్నట్లు గురువారం ‘సాక్షి’ విజిట్లో తెలిసింది.
ప్రధానంగా టాయ్లెట్స్ సమస్య..
పాఠశాలలు పునఃప్రారంభమై వారంరోజులైంది. హనుమకొండ జిల్లాలో విద్యార్థుల హాజరు 50నుంచి 60శాతం వరకే ఉంటోంది. ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా టాయ్లెట్స్ సమస్య విద్యార్థులను వేధిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి ద్వారా చేపట్టిన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో 492 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలుండగా అందులో 19 స్కూళ్లలో అసలు టాయ్లెట్సే లేవు. మరికొన్నిచోట్ల సరిపడా లేవు. 154 పాఠశాలల్లో కిచన్ షెడ్లు లేవు. దీంతో మధ్యాహ్నం వంటకు ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లాలో 41 పాఠశాలల్లో అసలే విద్యార్థులు లేరు.
● కాజీపేట అర్బన్: కాజీపేట మండలం అయోధ్యపురంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 32 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు టీచర్లు ఉండగా.. బోధనకు కేవలం రెండు తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక గది శిథిలావస్థకు చేరుకుంది.
● విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 347మంది విద్యార్థులున్నారు. ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నందున విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పాఠశాలలో హెచ్ఎంతో పాటు మరో ఏడుగురు ఎస్జీటీలు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరో ఐదుగురిని వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద గతేడాదిలో కేటాయించారు. 2 నుంచి 5వ తరగతి వరకు రెండు సెక్షన్ల చొప్పున ఉన్నాయి. దీంతో మరో ఇద్దరు ఉపాధ్యాయుల అవసరం ఉందని భావిస్తున్నారు. అలాగే హనుమకొండలోని సుబేదారి యూపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో అసంపూర్తి మరుగుదొడ్లు దర్శనమిస్తున్నాయి. గతంలో మన ఊరు–మనబడి కింద పనులు చేపట్టి వదిలేశారు. కొద్దిరోజుల క్రితం అమ్మ ఆదర్శ పథకం కింద మళ్లీ అవే పనులను చేపట్టారని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.. లోపల బేసిన్స్ వేశారు. చుట్టూ టైల్స్ వేయాల్సింది. అదేవిధంగా కిచెన్ షెడ్డు లేదు. పాఠశాలలో 1నుంచి 7వ తరగతి వరకు 50మంది వరకు విద్యార్థులున్నారు. హెచ్ఎం, నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు.
టీచర్లుంటే విద్యార్థుల్లేరు.. విద్యార్థులుంటే టీచర్లు లేరు
పలుచోట్ల మూతబడిన పాఠశాలలు
అధ్వానంగా మూత్రశాలలు
పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
హసన్పర్తి: ఇది చింతగట్టు క్యాంప్లోని ప్రాథమిక పాఠశాల. గతేడాది ఈ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులుండగా.. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహించారు. ఈఏడాది ఆవిద్యార్థులు మరో పాఠశాలలో చేరారు. దీంతో పాఠశాల మూత పడింది. 1980లో ఎస్సారెస్పీ ప్రాజెక్టు సందర్భంగా ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కాగా.. అప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేకపోవడంతో చింతగట్టు క్యాంప్లో విధులు నిర్వహించిన ఉద్యోగులంతా తమ పిల్లలతో పాఠశాల కిటకిటలాడింది. ఇక్కడి ఉద్యోగుల బదిలీ అనంతరం విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గింది. విద్యార్థులు లేక ఉపాధ్యాయులు డిప్యుటేషన్పై ఇతర పాఠశాలకు వెళ్లారు.
రోడ్డు దాటాలంటే భయం
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ 4వ డివిజన్ పరిధిలోని పెద్దమ్మగడ్డలోని పాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భయంభయంగా రోడ్డు దాటుతున్నారు. పెద్దమ్మగడ్డ, కేయూ బైపాస్ రోడ్డు ఇరుకుగా ఉండడం, వాహనాలతో రద్దీగా ప్రమాదకరంగా ఉంటుంది. ప్రతీ రోజు విద్యార్థులను ఉపాధ్యాయులే దగ్గరుండి ఇలా రోడ్డు దాటిస్తుంటారు.
శిథిలావస్థలో భవనాలు.. సమస్యల నడుమ చదువులు
శిథిలావస్థలో భవనాలు.. సమస్యల నడుమ చదువులు
శిథిలావస్థలో భవనాలు.. సమస్యల నడుమ చదువులు
శిథిలావస్థలో భవనాలు.. సమస్యల నడుమ చదువులు