
డ్రెయినేజీ పనుల్లో నాణ్యత డొల్ల!
వరంగల్ అర్బన్: గ్రేటర్లో అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మకై ్క ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నా.. కనీసం క్షేత్రస్థాయిలో వర్క్ ఇన్స్పెక్టర్, క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది కూడా అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రజల ప్రయోజనాల కంటే తమకు కావాల్సిన కాంట్రాక్టర్ల స్వలాభం, నాలుగు కాసులు వెనుకేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకు మచ్చుకు ఒక్క ఉదాహరణే వరంగల్ దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ నుంచి కొత్తవాడ బైపాస్ రోడ్డులోని డ్రెయినేజీ నిర్మాణం.
నాణ్యతకు తిలోదకాలు
బల్దియా నిధులు రూ.50లక్షలతో 500 మీటర్ల డ్రెయినేజీ నిర్మాణానికి టెండర్లు పిలించారు. ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకుని ఒప్పందాలు పూర్తి చేసుకున్న చాలా నెలల తర్వాత పనులు మొదలు పెట్టారు. పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు కడుతుండగానే మరో వైపు పగుళ్లు, రంధ్రాలు పడుతున్నాయి.
అంతా క్రషర్ మెటీరియలే..
ప్రభుత్వ నిబంధనల మేరకు గోదావరి ఇసుక, నాణ్యమైన కంకర, సిమెంట్తో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు నిర్మించాలి. కానీ, సదరు కాంట్రాక్టర్ ఇసుకకు బదులుగా క్రషర్లో వెలువడే రోబో ఇసుక, కంకర చూర, నాణ్యత లేని కంకర ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డ్రెయినేజీ ఒకవైపు కడుతుండగానే మరోవైపు రంధ్రాలు పడి నీళ్ల ఊటలు వస్తున్నాయి. నెలలు గడవకముందే ఈ నిర్మాణం పూర్తిగా ఛిద్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కమిషనర్ కళ్లెం వేసేనా?
బల్దియాకు తాజాగా కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ విధుల్లో చేరారు. నగరంలో దారి తప్పిన అభివృద్ధి పనుల నాణ్యతను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తా..
దేశాయిపేట ఫిల్టర్బెడ్ నుంచి 80 ఫీట్ల రోడ్డు వరకు జరుగుతున్న డ్రెయినేజీ పనుల నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షిస్తా. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
– రంగనాథ్, బల్దియా డీఈ
కమిషనర్ గారూ.. క్వాలిటీ పరిశీలించండి
500 మీటర్ల పనులకు
రూ.50 లక్షలు కేటాయింపు
ఇసుకకు బదులు క్రషర్ రోబో చూర
నాసిరకం కంకర, సిమెంట్
దారి తప్పిన గ్రేటర్ అభివృద్ధి పనులు
కాంట్రాక్టర్లకు ఇతోధికంగా
సహకరిస్తున్న ఇంజనీర్లు

డ్రెయినేజీ పనుల్లో నాణ్యత డొల్ల!