
రైతుల సహకారంతోనే రజతోత్సవ సభ
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామాల రైతులందరి సహకారంతోనే, వారి అనుమతితోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ స్పష్టం చేశారు. సోమవారం బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సోమవారం ఈ ప్రాంతానికి వచ్చి కాలువలు పూడుపుతున్నారని, రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. సభకోసం 1,200 ఎకరాల స్థలంలో రైతులందరి అనుమతి తీసుకొని వారి సమక్షంలోనే పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. సభకు వచ్చే ప్రజలు నడుచుకుంటూ వచ్చేలా కొన్ని ప్రాంతాల్లో మొరం పోశామని, తర్వాత దానిని కూడా తీసేస్తామని చెప్పారు. భూముల హద్దులు చెరిపేశారని అంటున్నారని, ఇందుకు ముందుగానే సర్వేయర్తో హద్దులు తీసుకున్నామని తర్వాత వాటిని యధావిధిగా పెడతామని హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, తంగెడ మహేందర్, గోల్లె మహేందర్, తంగెడ నగేష్, ఎల్తూరి స్వామి, మదన్మోహన్రావు, దుగ్గ్యాని సమ్మయ్య, వినయ్గౌడ్, చిట్టిగౌడ్, జడ్సన్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్