జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
తాడికొండ: రాజధానిలో రెండో విడత భూ సమీకరణలో భాగంగా భూములిచ్చే వారికి రిటర్నబుల్ ప్లాట్లను అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. తుళ్ళూరు మండలం పెదపరిమిలో భూసమీకరణపై జరిగిన గ్రామసభలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లతో కలిసి జిల్లా కలెక్టర్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమీకరణకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రైతుల సందేహాల నివృత్తికి గ్రీవెన్స్ నిర్వహించారు. భూములు అందించిన వారికి సంబంధిత పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఓటరు జాబితాపై
గ్రామ సభలు నిర్వహించాలి
గుంటూరు వెస్ట్: గ్రామ పంచాయతీల ఓటరు జాబితాపై గ్రామసభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలతో కలిసి సోమవారం సమావేశం నిర్వహించారరు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల తుది ప్రచురణ విడుదల చేసామన్నారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 2వ తేదీ నాటికి విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల పట్ల ఈ నెల 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించాలన్నారు. ఇందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ గుంటూరులో నాటిన ప్రతి మొక్క బతకాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, సీపీఓ పి.శేషశ్రీ, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయలక్ష్మి, డ్వామా పీడీ వి.శంకర్, అధికారులు పాల్గొన్నారు.


