చేబ్రోలు: చేబ్రోలు పోలీసు స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ముగ్గురు బాలురను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఢిల్లీలో కనుగొన్నారు. మంగళవారం వారిని సురక్షితంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన షేక్ ఆషియా తన కుమారుడు షేక్ జమీర్ అహ్మద్ (13) కనిపించడం లేదని ఈ నెల 21న చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుద్దపల్లి గ్రామానికి చెందిన రాయల భరత్ (12), గుండవరం గ్రామానికి చెందిన తుపాకుల వెంకట గోపి (15)లు కూడా ఇళ్ల నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. మంగళవారం సాయంత్రం చేబ్రోలు పోలీసు స్టేషన్లో పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, చేబ్రోలు ఎస్ఐ పి. వీరనారాయణలు మాట్లాడుతూ తెనాలి డీఎస్పీ జనార్దనరావు పర్యవేక్షణలో దర్యాప్తు సాగింది. ఇంటి నుంచి బ్యాగ్లో దుస్తులు, రూ. 22 వేల నగదుతో ముగ్గురు బాలురు ఢిల్లీ వెళ్లినట్లు తేలింది. సీసీ టీవీ ఫుటేజీల పరిశీలన, సాంకేతిక ఆధారాల సేకరణ, సెల్ఫోన్ కాల్ డీటెయిల్స్ విశ్లేషణ, లొకేషన్ ట్రేసింగ్ ద్వారా బాలుర కదలికలను పోలీసులు పసిగట్టారు. వారిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.
తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు


