పీఆర్సీ కమిషన్ నియమించాలి
లక్ష్మీపురం: పీఆర్సీ కమిషన్ను నియమించాలని ఏపీ ఎస్టీయూ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్టీయూ మలి విడత ఉద్యమ కార్యచరణలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సి.హెచ్.జోసఫ్ సుధీర్బాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబులు మాట్లాడుతూ దీర్ఘకాలిక ఆర్థిక బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించి వెంటనే చెల్లించాలన్నారు. నాలుగు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని పేర్కొన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని తెలిపారు. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం వర్తించేలా చేయాలన్నారు. పదవీ విరమణ చేసిన మరుసటి రోజునే ఉద్యోగికి ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ ఎం.శ్రీధర్, రాష్ట్ర బాధ్యులు ఎస్. రామచంద్రయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కె.విజయబాబు తదితరులు పాల్గొన్నారు.


