మురిసిన మువ్వన్నెల జెండా
మహనీయులను స్మరించుకుందాం
●వాడవాడలా జాతీయ పతాక రెపరెపలు
●నల్లపాడులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన డీఆర్ఎం సుథేష్ఠ సేన్
●తమవెంట తెచ్చుకుని భోజనం చేసిన యాత్రికులు
●సిబ్బంది వైఫల్యం మరోసారి బట్టబయలు
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే, గుంటూరు డివిజన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం ఆదివారం నల్లపాడు క్రికెట్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు కవాతు నిర్వహించారు. అనంతరం డీఆర్ఎం జాతీయ పతాకావిష్కరణ చేసి, మాట్లాడారు. తొలుత గత ఏడాదిలో గుంటూరు రైల్వే డివిజన్ సాధించిన విజయాలను వివరించారు. డిసెంబర్ చివరి నాటికి డివిజన్ రూ. 539 కోట్ల ఆదాయం సాధించిందని, ఇది గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 16 శాతం వృద్ధి అని తెలిపారు. అదే సమయంలో ఖర్చులు కూడా మంజూరైన బడ్జెట్ పరిమితులలోనే ఉన్నాయని పేర్కొన్నారు. రైల్వే ఆస్తి దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో రూ.1,31,560 విలువైన ఆస్తి స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. చివరగా, అవార్డు గ్రహీతలను, సిబ్బందిని అభినందించిన డీఆర్ఎం, గుంటూరు డివిజన్ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
రైతు సాధికార సంస్థ కార్యాలయంలో...
కొరిటెపాడు(గుంటూరు): అమరావతి రోడ్లోని గోరంట్లలో గల రైతు సాధికార సంస్థ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. సంస్థ సీఈఓ రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రైతు సాధికార సంస్థ గౌరవ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడం జరిగిందని, మార్చి నాటికి 18 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చి 20 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీ గ్రామీణ బ్యాంక్ కార్యాలయంలో..
కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్(ఏజీబీ) ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని ప్రధాన కార్యాలయం ఆవరణలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోద్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి పౌరుడు దేశం పట్ల తన బాధ్యతలను గుర్తు చేసుకోవాలన్నారు. బ్యాంక్ విజిలెన్స్ ఇన్చార్జి హరిష్ బేతా మాట్లాడారు. కార్యక్రమంలో బ్యాంక్ వివిధ విభాగాధిపతులు, జీఎంలు, ఏజీఎంలు, మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
విజయకీలాద్రి పర్వతంపై....
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, వేదపాఠశాలలో గణతంత్ర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీశ్రీ త్రిదండి చినజీయర్స్వామి జెండా వందనం నిర్వహించగా వేదవిద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురాణం వెంకటాచార్యులు, వేదపండితులు, వేద విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో..
జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్.అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కార్యాలయపు సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఏ.హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు మురళీకృష్ణ (ఉత్తర), శ్రీనివాసులు (ఎస్బీ), అరవింద్ (గుంటూరు పశ్చిమ), సంకురయ్య (ఏఆర్), ఎస్బీ సీఐ అలహరి శ్రీనివాస్, ఏఏఓ.జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్ కాలేజీలో...
గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీలో సోమవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన బ్రింద హాస్పటల్ అధినేత, బాహుబలి సర్జన్ డాక్టర్ భపనం హనుమ శ్రీవినాస సమక్షంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. త్వరలో జరగనున్న మెడికల్ ఎగ్జిబిషన్ సందర్భంగా నిర్వహించిన కళా పోటీల్లో విజయం సాధించిన చిన్నారులకు పతకాలు, విన్నర్ పాస్లు అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ (అడ్మిన్) డాక్టర్ శ్రీధర్ మాట్లాడారు. కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. దేశభక్తి గీతాలు, సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
ఏఎన్యూలో..
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. డైక్మెన్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధర్రావు విచ్ఛేసి ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దిన ప్రాముఖ్యతను, విశ్వవిద్యాలయ అభివృద్ధిని తెలియజేశారు. ఈ వేడుకలకు గణతంత్ర దినోత్సవ కన్వీనర్ ప్రొఫెసర్ పి.పి.ఎస్.పాల్ కుమార్ అధ్యక్షత వహించారు. అనంతరం ఎన్సీసీ క్యాడేట్స్కు ర్యాకింగ్స్ ఆధారంగా మెడల్స్ ప్రదానం చేశారు. విద్యార్థుల దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇన్ఛార్జి రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్, ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.రోశయ్య, ఓఎస్డీ ఆర్వీఎస్ఎస్ఎన్ రవికుమార్, ఆరు కళాశాలల ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాల డైరెక్టర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారన్నారు.
జిల్లా పరిషత్ కార్యాలయంలో...
గుంటూరు ఎడ్యుకేషన్: 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు ఎగురవేశారు. ఈసందర్భంగా మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలని అన్నారు. ప్రతి ఒక్కరు సోదరభావంతో మెలగాలని సూచించారు. జెడ్పీ పరిపాలనాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
పెదకాకాని: శివాలయానికి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో మాంసాహారంతో భోజనం చేయడం చర్చనీయాంశంగా మారింది. పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో యాత్రికుల బస్సు వచ్చింది. ఆలయ ప్రాంగణంలోని బస్సు నిలిపి అందులో ఉన్న ఆహారం గిన్నెలు బయటకు తీసి అక్కడే భోజనం చేశారు. వారు చేసిన భోజనం మాంసాహారం కావడంతో ఆ వాసనలు స్థానికులు గుర్తించి, ప్రశ్నించడంతో తిన్న ఆకులు సైతం అనుమానం రాకుండా, ఆ బస్సులోనే యాత్రికులు తీసుకెళ్లారు. ఇంత జరుగుతున్నా ఆలయ నైట్ వాచ్మెన్, సిబ్బంది ఏం చేస్తున్నారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. శివాలయంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దీనిపై ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ను వివరణ కోరగా ఆదివారం రాత్రి ఆలయానికి వచ్చిన బస్సులోని ప్రయాణికులు భోజనం చేశారని, అందులో మాంసాహారం ఉందనే విషయం సోమవారం తమ దృష్టికి వచ్చిందన్నారు. బస్సు నెంబరు ఆధారంగా వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు.
పెదకాకాని శివాలయంలో మాంసాహార భోజనం
తాడేపల్లి రూరల్: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుందామని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. సోమవారం తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత జాతీయ జెండా ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం ప్రఖర్ జైన్ గణతంత్ర దిన ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, ఏఓ హనుమంతరావు, ఎస్ఈఓసీ ఇన్చార్జి పీటర్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ ఆఫీసర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
మురిసిన మువ్వన్నెల జెండా
మురిసిన మువ్వన్నెల జెండా
మురిసిన మువ్వన్నెల జెండా
మురిసిన మువ్వన్నెల జెండా
మురిసిన మువ్వన్నెల జెండా


