రంగవల్లులు సాంస్కృతిక ప్రతీకలు
సంబరంగా ముగ్గుల పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన రంగవల్లుల పోటీలకు విశేష ఆదరణ లభించింది. ఆయా చోట్ల జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 7వరకు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో నాలుగైదు డివిజన్లు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి పోటీలు నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఒక క్లస్టర్ పరిధిలోని 18, 19, 20, 22 డివిజన్లకు సంబంధించి వైఎస్సార్ సీపీ నేతలు గేదేల రమేష్, కలపాల సత్యం, పల్లపు మహేష్, వెంక టేష్, పల్లపు దుర్గామహేష్, ఖాజామొహీద్దీన్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావుపేటలోని శ్రీ రామనామక్షేత్రంలో ఆదివారం జరిగిన ముగ్గుల పోటీల్లో అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించారు. పోటీల్లో 78 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు.
గ్రామీణ సంప్రదాయాలకు ఊపిరి
ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాల్లో అంబటి రాంబాబు మాట్లాడుతూ మన సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేయటంతో పాటు, ముగ్గుల పోటీల ద్వారా గ్రామీణ సంప్రదాయాలకు ఊపిరి పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించే ఈ పోటీల్లో ప్రతి గీత వెనుక ఓ కథ, ప్రతి రంగు వెనుక ఓ విశ్వాసం దాగి ఉంటుందన్నారు. మహిళలు తమ సృజనాత్మకతను, సహనాన్ని, సంప్రదాయాలపై ఉన్న అభిమానాన్ని ఈ పోటీల్లో ప్రతిబింబిస్తారన్నారు. అమ్మమ్మల దగ్గర నేర్చుకున్న నమూనాలు, తల్లుల చేతిలో మెరుగుపడిన శైలులు, నేటి తరం ఆలోచనలతో కొత్త రూపు దాల్చి ముగ్గులుగా రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు.
సామాజిక ఐక్యతకు ప్రతీకలు
ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలు మహిళలకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా మాత్రమే కాక, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఒకే ముంగిట్లో కలిసిన రంగులు, ఒకే ఆకాశం కింద పోటీపడే మనసులు మన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ముగ్గుల పోటీలు అంటే రంగుల పండుగే కాదని, మన మూలాలను గుర్తు చేసే సాంస్కృతిక సంబరమేనని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా తెలుగుదనం ఉట్టి పడుతుందని, భవిష్యత్తు తరాలకు మన సాంప్రదాయాలను చాటి చెప్పగలమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నగర, జిల్లా కమిటీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
రంగవల్లులు సాంస్కృతిక ప్రతీకలు
రంగవల్లులు సాంస్కృతిక ప్రతీకలు
రంగవల్లులు సాంస్కృతిక ప్రతీకలు


