
యోగాతో హెల్త్ వెల్త్
యోగా... నేడు అంతర్జాతీయ తారకమంత్రంగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశమే మార్చేసింది. ఇక్కడే పుట్టి ఖండాతరాల్లో వ్యాపించింది. 2014లో అంతర్జాతీయ పేటెంట్ పొందింది భారత్. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు జూన్ 21, 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం యోగా ఫర్ వన్ ఎర్త్– వన్ హెల్త్ ( ఒక భూమి– ఒక ఆరోగ్యం కోసం యోగా) ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. శారీరక శక్తి, మానసిక స్పష్టత, భావోద్వేగ శాంతి, ఆధ్యాత్మిక సామరస్యత కోసం యోగాను శక్తివంతమైన సాధనంగా ప్రోత్సహించడం దీని ఉద్దేశం.
గుంటూరు వెస్ట్ ( క్రీడలు ): అతి తక్కువ ఖర్చుతో కుల మతాలకు అతీతంగా చక్కని ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పొందడం యోగా ప్రత్యేకత. చక్కటి ఆరోగ్య అలవాట్లు, పాజిటివ్ దృక్పథంతో పాటు సామాజిక బాధ్యత కూడా మిళితమై ఉండడం మరో ప్రత్యేకత. అందుకే పేద వాడి దగ్గర్నుంచి ఉన్నత వర్గాలు, విద్యాంతులు, వైద్యులు కూడా యోగ సాధన చేస్తున్నారు. జిల్లాలో గత నెల రోజుల నుంచి యోగాంధ్ర–2025 పేరుతో ప్రతి రోజూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం జరగనున్న యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో సుమారు 5 లక్షల మందితో యోగాసనాల కార్యక్రమం నిర్వహించనున్నారు. గుంటూరులో 35 వరకు యోగా కేంద్రాలు వారి స్థాయిలో శిక్షణనిస్తున్నాయి. కొన్ని స్వల్ప ఫీజులతో ఉంటే మరికొన్ని ఏసీ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు పెద్ద మొత్తంలో తీసుకుంటున్నాయి. ఆన్లైన్ క్లాసులు కూడా కొందరు చెబుతున్నారు.