రెవెన్యూ డేను ఘనంగా నిర్వహిస్తాం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ డేను ఘనంగా నిర్వహిస్తాం

Jun 18 2025 3:39 AM | Updated on Jun 18 2025 3:39 AM

రెవెన్యూ డేను ఘనంగా నిర్వహిస్తాం

రెవెన్యూ డేను ఘనంగా నిర్వహిస్తాం

గుంటూరు వెస్ట్‌: ఈ నెల 20వ తేదీన జరగనున్న రెవెన్యూ డేను ఘనంగా నిర్వహిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్‌ ఖాజావలి తెలిపారు. 2024లో రెవెన్యూ బోర్డ్‌ ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని రెవెన్యూ డేను నిర్వహిస్తుంటారని చెప్పారు. రెవెన్యూ శాఖ ప్రజలకు అందించే సేవలను విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తామన్నారు. మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు ఉంటాయని చెప్పారు. రెవెన్యూ డేను ఘనంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌ మంగళవారం డీఆర్వోకు ఆయన చాంబర్‌లో వినతిపత్రం అందజేశారు.

వైద్య సిబ్బందికి

బదిలీ కౌన్సెలింగ్‌

గుంటూరు మెడికల్‌: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు వైద్య సిబ్బందికి మంగళవారం గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) జూమ్‌ ద్వారా సాధారణ బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పలువురు పారామెడికల్‌ సిబ్బందిని బదిలీ చేశారు. బుధవారం, గురువారం కూడా బదిలీలు జరుగుతాయని ఆర్డీ డాక్టర్‌ కె.సుచిత్ర తెలిపారు.

నేడు ధ్యాన బుద్ధ వద్ద యోగాంధ్ర

నరసరావుపేట: జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం వద్ద బుధవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు మంగళవారం వెల్లడించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

అరకు కాఫీ అవుట్‌లెట్‌ ఏర్పాటుకు ప్రోత్సాహం

నరసరావుపేట రూరల్‌: నేటివ్‌ అరకు కాఫీ అవుట్‌ లెట్‌ ఏర్పాటు కోసం సెర్ప్‌ ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నట్టు పల్నాడు జిల్లా ఉద్యాన అధికారి ఇ.వెంకట్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల పథకంలో భాగంగా ఈ అవుట్‌లెట్‌ స్థాపనకు రూ.10లక్షలు అంచనా కాగా, 35 శాతం రాయితీ ఇస్తామన్నారు. జిల్లా, మండల సెర్ప్‌ సిబ్బందిని లేదా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జిల్లా రీసోర్స్‌ పర్సన్‌లను సంప్రదించాలని సూచించారు.

బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలోనూ ఆర్జిత సేవల కౌంటర్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి ఆలయ సత్రాలు, కాటేజీలతో పాటు రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ కౌంటర్లలో అన్ని ఆర్జిత సేవలను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నామని దుర్గగుడి ఈవో శీనానాయక్‌ పేర్కొన్నారు. రైల్వే స్టేషన్‌ 1వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న దేవస్థాన ప్రసాదాల కౌంటర్‌ను ఆలయ ఈవో శీనానాయక్‌ మంగళవారం తనిఖీ చేశారు. కౌంటర్‌లో లభిస్తున్న సేవల గురించి సిబ్బందిని ఆరా తీశారు. కేవలం అమ్మవారి ప్రసాదాలను మాత్రమే భక్తులకు అందిస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. దేవస్థానానికి సంబంధించిన అన్ని ఆర్జిత సేవలను బుక్‌ చేసుకోవడమే కాకుండా ఆలయ సమాచారం మొత్తం భక్తులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న నిందితులు

బాపట్ల టౌన్‌: బైక్‌లు, విద్యుత్‌ మోటార్లు చోరీ కేసులో నిందితులైన ఇద్దరు బాలురను మంగళవారం విజయవాడలోని కోర్టులో బాపట్ల పోలీసులు హాజరుపరిచారు. కోర్టు అనుమతితో వీరిని కోర్టు నుంచి జువైనల్‌ హోంకు తరలించేందుకు కోర్టు సమీపంలో బస్సు ఎక్కించేందుకు బస్టాండ్‌కు తీసుకెళ్లారు. ఇద్దరు నిందితులకు కాపలాగా ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు ఉన్నారు. పోలీసుల కళ్లుగప్పి చిన్నారులు ఇద్దరు విజయవాడ బస్టాండ్‌ నుంచి పరారయ్యారు. వీరికోసం ఎంతసేపు గాలించినా ఆచూకీ లభించలేదు. ఒకరు బాపట్ల పట్టణానికి చెందిన వ్యక్తికాగా, మరొకరు కర్లపాలెం మండలం పేరలి గ్రామానికి చెందిన వ్యక్తి. వీరికోసం అర్ధరాత్రి వరకు పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement