తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునః పరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్ను నిర్వహించారు. ఆర్థో–100, ఈఎన్టీ–50, సెక్రాటిక్ విభాగాలకు చెందిన 50 మంది వికలాంగులు పరీక్షలు చేయించుకున్నారు. గురు, శుక్రవారాలలో కూడా క్యాంప్ నిర్వహించనున్నట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు.
పాలిసెట్లో 97.07 శాతం ఉత్తీర్ణత
గుంటూరు ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 30న జరిగిన పాలిసెట్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లాలో 97.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో బాలురను అధిగమించిన బాలికలు 97.99 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో పాలిసెట్కు హాజరైన 4,129 మంది విద్యార్థుల్లో 4,008 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 2,587 మంది పరీక్ష రాయగా, 2,497 మంది ఉత్తీర్ణులయ్యారు. 96.52 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
బాలికలు 1,542 మంది హాజరు కాగా, 1,511 మంది ఉత్తీర్ణులయ్యారు. 97.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అక్కల బిమల్ రాజేంద్ర 191వ ర్యాంకు, వేమా ప్రేమ్కుమార్ 285వ ర్యాంకు, కాకుమాను అన్యూన్య 326వ ర్యాంకు సాధించి జిల్లాలో టాపర్లుగా నిలిచారు.
హోమ్స్ను సందర్శించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
గుంటూరు లీగల్: క్యాలెండర్ యాక్టివిటీస్లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు బుధవారం గుంటూరులోని హోమ్స్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ సందర్శించారు. దిశా వన్ స్టాప్ సెంటర్, శిశు గృహం, స్వధార్ హోమ్, లీమా డెఫ్ అండ్ డమ్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించారు. అక్కడున్న అధికారులతో మాట్లాడారు. పిల్లలకు అందుతున్న విద్య, వైద్య సదుపాయాలు, రూంలను పరిశీలించారు. దిశా వన్ స్టాప్ సెంటర్, స్వధార్ హోమ్లో మహిళలకు అందుతున్న సదుపాయాల గురించి వాకబు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి రిజిస్టర్స్ను పరిశీలించారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఫ్రీ లీగల్ ఎయిడ్, బాధిత మహిళలకు అందే పరిహారం గురించి వివరించారు. కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, హోమ్ నిర్వాహకులు పాల్గొన్నారు.
విపత్తుల నిర్వహణపై అవగాహన అవసరం
గుంటూరు వెస్ట్: ప్రకృతి వైపరీత్యాలు, భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కనీస అవగాహన ఉంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) షేక్ ఖాజావలి అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన మాక్ డ్రిల్లో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు భయాందోళనకు గురికాకూడదని తెలిపారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వీలైనంత వరకు నష్టం తగ్గించడం మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఫైర్ వస్తోందని తెలుసుకోవడానికి ముందుగా పొగను గుర్తించాలని, ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారంతా బయటకు వచ్చేయాలని తెలిపారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

తెనాలిలో సదరం క్యాంప్ పునః ప్రారంభం