ఖడ్గ దళం
కజిరంగ నేషనల్ పార్క్లో 2025లో ఒక్క ఖడ్గమృగం కూడా వేటగాళ్ల బారిన పడలేదు. ఇది రికార్డు. ఇందుకు కారణం ఆ పార్కులో వేటగాళ్లకు సింహస్వప్నంగా మారిన మహిళా గార్డ్స్ దళం ‘వన దుర్గ’ ఆగస్టు 2023లో మొదలైన దళం కేవలం రెండేళ్లలోనే వేటగాళ్ల భరతం పట్టి కజిరంగను విముక్తం చేయగలిగింది. వారి గస్తీ గురించి కథనం.
పురుషులు సాధించలేకపోయిన ఘనత స్త్రీలు సాధించారు. కజిరంగ అరణ్యాలలో దశాబ్దాలుగా సాగుతున్న ఖడ్గమృగాల వేటకు అడ్డు కట్ట వేయగలిగారు. వేటగాళ్ల పట్ల దుర్గలుగా మారి చెండుకు తిన్నారు. అందుకే వన్యమృగాల పరిరక్షణలో, అడవుల రక్షణలో ప్రతి చోటా వనదుర్గ గార్డ్స్ లాంటి దళాలు ఉండాలని వన్య ప్రేమికులు భావిస్తున్నారు.
వేటగాళ్ల ఉనికి
ప్రపంచంలోనే అత్యధికంగా ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు మనదేశంలో ఉన్నాయి. ప్రపంచంలోని ఖడ్గమృగాల మొత్తం సంఖ్యలో ఇది దాదాపు 70 శాతం. అస్సామ్ రాష్ట్రంలోని కజిరంగ జాతీయ పార్క్లో దశాబ్దాలుగా ఖడ్గమృగాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వేట పెద్ద సవాలుగా మారింది.
కొమ్ములు కోశాక చనిపోయిన ఖడ్గమృగాల కళేబరాలు, వాటి పక్కన పడి ఉన్న తూటాలు అక్కడ. ఇదంతా నిన్నటి మాట. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. వనదుర్గలు రక్షణ కవచాలుగా మారి ఖడ్గమృగాలను రక్షిస్తున్నాయి. వేటగాళ్లకు సింహస్వప్నంగా మారిన మహిళా గార్డ్స్ దళం ‘వనదుర్గ’. 2023లో మొదలైన ఈ దళం రెండేళ్లలోనే వేటగాళ్ల భరతం పట్టి కజిరంగను విముక్తం చేయగలిగింది.
వేటగాళ్లను చంపడం న్యాయమేనా?
అక్కడ ఆయుధాలతో కనిపిస్తే కాల్చమని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఇది ప్రాణాంతకమని, సైనిక చర్య అని పలువురు విమర్శించారు. ఇప్పటికి ఇరవైమంది వేటగాళ్లను కాల్చి చంపినట్లు బీబీసీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ‘దేశానికి తాజ్మహల్ ఎలాగో, అస్సాంకు ఖడ్గమృగం అలాగే’ అని చెబుతూ తన వైఖరిని సమర్థించుకుంది.
ఈ సమష్టి ప్రయత్నాలు శాశ్వత ఫలితాలను చూపిస్తున్నాయి. 2009లో 2,048గా ఉన్న ఖడ్గమృగాల సంఖ్యను, 2022 జనాభా లెక్కల ప్రకారం పార్క్ 2,613కి పెంచింది. అనుమానిత వేటగాళ్లతో కాల్పుల ఘటనలు కూడా తగ్గాయి. 2025లో ఒక్క ఖడ్గమృగం కూడా కజిరంగలో వేటగాళ్ల తుపాకీకి చిక్కలేదు. ఇది చాలా పెద్ద సంగతి. ఈ విజయానికి పూర్తిగా హక్కుదార్లు, ఆ వనాల దేవతలు వన దుర్గ గార్డ్సే.
ఐదు చదరపు కిలోమీటర్లకు ఒక అవుట్పోస్టు
కజిరంగలో ఖడ్గమృగాల రక్షణ కోసం మహిళా గార్డ్స్ దళం ‘వనదుర్గ’ మొదలయ్యాక ఎవరైనా అక్కడ ఆయుధాలతో కనిపిస్తే కాల్చమని ప్రభుత్వం వారికి ఆదేశాలిచ్చింది. వారి కోసం పార్కులో ప్రతి ఐదు చదరపు కిలోమీటర్లకు ఒక అవుట్పోస్టు ఏర్పాటు చేశారు. వన దుర్గ గార్డ్స్ పార్క్ క్యాంపులో 24 గంటలూ ఉంటారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకుంటారు. అలాగే వేటగాళ్లపై పోరాటంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించింది. పార్క్ అంతటా ఎలక్ట్రానిక్ కళ్ళు, థర్మల్ సెన్సార్లు, కెమెరా ట్రాప్లు, నైట్ విజన్ కెమెరాలను వ్యూహాత్మకంగా అమర్చారు.
వీటిని వనదుర్గ గార్డ్స్ పర్యవేక్షిస్తూ వేగంగా స్పందిస్తారు. డ్రోన్ నిఘా, శాటిలైట్ ఫో¯Œ లు కూడా ఉన్నాయి. కజిరంగలో ప్రమాదం ఎల్లప్పుడూ వేటగాళ్ల నుండే రాదు. కోపంగా ఉన్న ఖడ్గమృగాలు ఎలాంటి హెచ్చరిక లేకుండా దాడి చేసి, తమ కొమ్ములతో ప్రాణాంతకంగా గాయపరచగలవు. వన దుర్గలు ఈ ప్రమాదాల నుంచి కూడా రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ‘ఖడ్గమృగం దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, కొన్నిసార్లు మేము గాలిలో కాల్పులు జరపాల్సి వస్తుంది‘ అని వన దుర్గ గార్డ్స్ తెలిపారు.


