విద్యా కుసుమాలు.. వాడిపోతున్నాయి | Student Suicides Surpass Population Growth Rate In India Maharashtra Leads | Sakshi
Sakshi News home page

పుట్టే వారి కంటే ఎక్కువైన విద్యార్థి ఆత్మహత్యలు!

Aug 29 2024 12:13 PM | Updated on Aug 29 2024 3:44 PM

Student Suicides Surpass Population Growth Rate In India Maharashtra Leads

ప్రతీకాత్మక చిత్రం

పరీక్ష పాసవ్వలేదనో, అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, ప్రేమవిఫలమైందనో.. మరో కారణంగానో  చిన్న వయసులోనే జీవితాల్ని చాలిస్తున్న విద్యార్థులు ఆత్యహత్యలు మనసుల్ని పట్టి కుదిపేస్తుంటాయి. కదా.. తాజాగా ఒక అధ్యయనం ఈ తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది.   భారతదేశంలో జనభా వృద్దిరేటు కన్న విద్యార్థులు ఆత్యహత్యలే ఎక్కువ అని తేలింది.  నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ఆధారంగా, ఇంటర్నేషనల్ కెరీర్ అండ్ కాలేజ్ కౌన్సెలింగ్ (IC3) కాన్ఫరెన్స్ ,ఎక్స్‌పో 2024లో బుధవారం  సమర్పించిన "విద్యార్థుల ఆత్మహత్యలు: భారత్‌ను వణికిస్తున్న మహమ్మారి(ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా)" నివేదికలో ఈ విషయాలు వెల్లడైనాయి.


ఈ నివేదిక ప్రకారం మొత్తం ఆత్మహత్యల సంఖ్య సంవత్సరానికి 2 శాతం పెరిగింది.  2021- 2022 మధ్య విద్యార్థుల బలవన్మరణాలు 4 శాతం పెరిగాయి. విద్యార్థుల ఆత్మహత్య కేసులు తక్కువగా నమోదయ్యే అవకాశ ఉన్న నేపథ్యంలో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. అంతేకాదు ఇది మొత్తం ఆత్మహత్యల ట్రెండ్‌ను కూడా ఇది అధిగమించింది. గత దశాబ్దంలో, 0-24 సంవత్సరాల వయస్సున్న జనాభా 582 మిలియన్ల నుండి 581 మిలియన్లకు తగ్గగా, విద్యార్థుల ఆత్మహత్యలు 6,654 నుండి 13,044కి పెరిగింది. 

ఆందోళనకరంగా విద్యార్థుల ఆత్మహత్యలు!
దేశంలో జనాభా వృద్ధి, మొత్తం ఆత్మహత్యల రేట్ల కంటే, విద్యార్థి ఆత్మహత్యలే అధికంగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా వీరి ఆత్మహత్యల వార్షిక రేటు నాలుగు శాతం  పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు అనూహ్యంగా పెరిగాయని, పురుషుల ఆత్మహత్యలు 50 శాతం, మహిళల ఆత్మహత్యలు 61 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో 53 శాతం మగ విద్యార్థులే. అయితే, 2021-22 మధ్య, మగ విద్యార్థుల ఆత్మహత్యలు 6 శాతం తగ్గాయి.  కానీ ఇదే సమయంలో ఆడపిల్లల ఆత్మహత్యలు 7 శాతం పెరగడం గమనార్హం.

మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో అత్యధిక విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్న రాష్ట్రాలుగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇది జాతీయ మొత్తంలో మూడింట ఒక వంతు. దక్షిణాది రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు సమిష్టిగా 29 శాతం వాటా కలిగి ఉన్నాయి. కోటా లాంటి కోచింగ్ కేంద్రాల హబ్‌ రాజస్థాన్‌  రాష్ట్రం 10వ స్థానంలో ఉంది.  

అంతేకాదు కేసులు నమోదైన దాని ప్రకారం గుర్తించిన డేటా  మాత్రమేననని, నమోదు కానీ కేసుల సంఖ్య కలిస్తే వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చనే ఆందోళన వ్యక్తం చేసింది.  2017 మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఆత్మహత్యాయత్నాలను నేరరహితం చేసినప్పటికీ రిపోర్టింగ్ పద్ధతులను ప్రభావితం చేస్తూనే ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రిపోర్టింగ్ తక్కువగా ఉంటుందని నివేదిక తెలిపింది. 

విద్యార్థి ఆత్మహత్యలకు కారణాలు- నివారణ మార్గాలు
ఆర్థిక, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ర్యాంకుల్లో  రేసులో  వముందుండాలనే విషయంలో తల్లిదండ్రులు ,సమాజం నుండి తీవ్రమైన పోటీ, భారీ అంచనాలు విద్యార్థులలో అధిక ఒత్తిడికి, ఆందోళనకు కారణమవుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు: డిప్రెషన్, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులు విద్యార్థుల ఒత్తడికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. అయితే విద్యార్థుల మానసిక ఆందోళనలో అండగా నిలిచి, తగిన సహాయం, కౌన్సెలింగ్ సదుపాయాలు విద్యాసంస్థల్లో లేకపోవడం దురదృష్టం. ఆత్మహత్య ఆలోచనలు అడ్డుకుని, ఆరోగ్య,  కెరీర్ కౌన్సెలింగ్ అందించడం ,అవగాహన  కల్పించడం చాలా అవసరం.

కుటుంబ సమస్యలు, వివాదాలు, తల్లిదండ్రుల ఘర్షణలు,కుటుంబ సభ్యులనుంచి తగిన  ఆ‍ప్యాయత, ఆసరా లేకపోవడంతో నిరాశతో కుంగిపోతున్న విద్యార్థులు. అందుకే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలి.  సమస్యలతో బాధపడుతున్నవారికి  మానసిక ఆరోగ్య నిపుణులు లేదా విశ్వసనీయ వ్యక్తులద్వారా కౌన్సెలింగ్‌  ఇప్పించడం ముఖ్యం.
 

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యకు ప్రయత్నించడం మరియు సహాయం చేయడం నేరం.
  
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement