
సామాజిక మాద్యమాల మత్తులో పిల్లలు, యువత తప్పటడుగులు
పాపులారిటీ కోసం కోల్పోతున్న ప్రాణాలు
మృత్యువుతో ముడిపడుతున్న యువతరం టేస్ట్
చదువు, కెరీర్పై నిర్లక్ష్య ధోరణి తల్లిదండ్రులకు తప్పని వేదన
పద్ధతి మార్చుకోవాలంటున్న మానసిక నిపుణులు
‘కరీంనగర్కు చెందిన పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఖరీదైన ఫోన్ కావాలంటూ ఇంట్లో మారాం చేశాడు. కళాశాలకు వెళ్లేటప్పుడు కొనిస్తామంటే వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పారిపోయిన కొడుకు హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించిన తల్లిదండ్రులు అతడిని తెచ్చి ఫోన్ఇచ్చారు. చాలా కుటుంబాల్లో పిల్లలతో తల్లిదండ్రులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారని మానసిక నిపుణులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలనే తాపత్రయంతో విద్యార్థులు వాటిపై దృష్టి సారిస్తున్నారు. దీంతో చదువుపై ఏకాగ్రత తప్పుతోందని చెబుతున్నారు’
రీల్స్పై తాపత్రయం.. ప్రాణాపాయం
‘జిల్లాలోని ఓ పట్టణప్రాంతానికి చెందిన తొమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇటీవల క్లాస్రూమ్లో పరీక్ష రాస్తూ నిద్ర పోయాడు. ఉపాధ్యాయుడు గమనించి అతడి ముఖంపై నీళ్లు చల్లినా.. స్పందన కరువైంది. సమీప ఆస్పత్రికి తీసుకెళ్తే డీహైడ్రేషన్ కారణంగా అనారోగ్య సమస్య తలెత్తినట్టు డాక్టర్లు తెలిపారు. రెండురోజులు మిత్రులతో కలిసి రీల్స్ చేసేందుకు ఇతర ప్రాంతానికెళ్లడమే కారణమని తేలింది. చదువుకునే వయసులో ఎందుకీ పనులని టీచర్లు ప్రశ్నించగా.. తనకు నెలకు రూ.10 వేలు వస్తాయని బదులివ్వడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.’
ప్రస్తుత ప్రపంచమంతా ‘లైక్’, ‘కామెంట్’, ‘షేర్’ రూపంలో మారిపోయింది. ఈ వర్చువల్ ప్రపంచపు చిరునవ్వుల కోసం యువత, విద్యార్థులు అనర్థాల బాట పడుతున్నారు. ఒక్క చిన్న రీల్, కొద్ది సెకన్ల వీడియో, ఒక్క ఫేమ్ కోసం ప్రాణాన్ని కూడా పణంగా పెడుతున్నారు. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సోషల్ మీడియా మన జీవితాల్లో భాగమైంది. ముఖ్యంగా కరోనా సమయంలో విద్యార్థుల కో సం అందించిన ఫోన్లు, ఇప్పుడు వారి జీవితాన్ని ని యంత్రించే ఆయుధాలుగా మారాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా, రీల్స్ యువతకు ఆత్మలుగా మారిపోయాయి. ఇటీవల కరీంనగర్ మానేరు వాగులో ఓ యువకుడు రీల్స్ కోసం వెళ్లి మునిగిపోయాడు. మరో యువకుడు రైలుపై రీల్ తీయడానికి వెళ్లి మృత్యువాతపడ్డాడు. ఇలా రోజురోజుకు రీల్స్ పిచ్చి అనార్థాలకు దారీతీస్తోంది.
యువత మారాలి..
రీల్స్ను కట్టడి చేయాలంటే యువత ముందుగా పద్ధతి మార్చుకోవాలని, ప్రాణాంతక రీల్స్తో జీవితాలే కోల్పోతామని గుర్తుంచుకోవాలని సైక్రియాటిస్టులు పేర్కొంటున్నారు. అలాగే రీల్స్ వెనక దాగి ఉన్న ప్రమాదాలు ఊహించకుండా వీడియోలు చూస్తున్నవారు అనేక రకాల యాడ్స్ రూపంలో మోసాలకు గురువుతున్నారు. ఆన్లైన్ రమ్మీ, ట్రేడింగ్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాడ్స్ ద్వారా ప్రజలు కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్
వయోభేదం లేకుండా..
సామాజిక మాధ్యమాలు బాల్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వయోభేదం లేకుండా పావులారిటీ కోసం ఫొటోలు, వీడియోలు, ప్రదర్శనలకు వాటిని వేదికగా మలచుకుంటున్నారు. వారించాల్సిన కొంతమంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపకరిస్తున్నా, చదువుపై నిర్లక్ష్యం పెరుగుతోందని కన్నవారు గుర్తించలేకపోతున్నారు.
రీల్స్తో అనర్థాలు
రీల్స్ కోసం చేసే బైక్ విన్యాసాలతో చాలా మంది యువతకు అనర్థాలు జరిగాయి. కరీంనగర్ మానేరు, బైపాస్, మల్కాపూర్, బొమ్మకల్, చింతకుంట తదితర ప్రాంతాల్లో యువత బైకులు తిప్పుతూ, రోడ్లపై హుషారుగా రీల్స్ తీసే ప్రయత్నాల్లో బలవుతున్నారు. డివైడర్లకు తగిలి, ఎదురుగా వస్తున్న వాహనాలకు ఢీకొని ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. రీల్స్ వెనక నిజజీవితంలో జరుగుతున్న విషాదాలు ఎవరిదృష్టిలో పడడం లేదు. కరీంనగర్ జిల్లాలో రీల్స్ తీసే యత్నంలో యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉండగా తాజాగా అర్బాజ్ అనే యువకుడు మానేరువాగులో రీల్ తీసేక్రమంలో నీటమునిగి మృతిచెందాడు. అతడితో ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా కాపాడలేకపోయారు. ఇదే జిల్లాకు చెందిన మరో యువకుడు రైలుపై రీల్ తీయబోతూ కరెంట్షాక్కు గురై మృత్యువాతపడ్డాడు.
చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?
ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
రీల్స్కు యువత ఆకర్షితులవడంతో అది వ్యసనంగా మారడం జరుగుతుంది. వ్యక్తిత్వ వికాస లోపంతోనే సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతున్నారు. కాగ్నటివ్ బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్ ద్వారా వీటి నుంచి బయటపడే అవకాశాలున్నాయి. యువత భవిష్యత్తు మీద దృష్టి పెట్టి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి.
– డాక్టర్ అట్ల శ్రీనివాస్రెడ్డి, సైక్రియాటిస్టు