పరమ దయాళువు ఆదిభిక్షువుని అర్చించుకుందాం ఇలా..! | Mahashivratri 2026: Significance of Maha Shivaratri And Its Pooja | Sakshi
Sakshi News home page

పరమ దయాళువు ఆదిభిక్షువుని అర్చించుకుందాం ఇలా..!

Feb 15 2026 12:44 PM | Updated on Feb 15 2026 1:19 PM

Mahashivratri 2026: Significance of Maha Shivaratri And Its Pooja

దేవతలందరిలోకీ పరమ బోళా వాడు పరమేశ్వరుడొక్కడే. అవతలి వాడు అసురుడని, వాడు కోరుతున్న వరం లోకాలకే కాదు, తనకు కూడా ముప్పు కలిగిస్తుందని తెలిసి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదెప్పుడూ. ‘అదిన్నీ నీ పతిప్రాణంబు దక్క..’ అని సతీ సావిత్రికి యముడు పెట్టినట్టు మెలిక పెట్టలేదు. కోరిన వరాన్ని కోరిన విధంగానే అనుగ్రహించేశాడు ఆనక తానెన్ని తిప్పలైనా పడనీ... అందుకు ఉదాహరణే గజాసురుడు, భస్మాసురుడు, బాణాసురుడు. వారు కోరిన వరాలను ముందు వెనకలు ఆలోచించకుండా నెరవేర్చేశాడు. 

గజాసురుడు తన గర్భంలో వసించమని కోరితే ‘వస్తున్నాను పో΄ అనుకుంటూ అమాంతం అతడి పొట్టలోకి దూరిపోయాడు. ఇక భస్మాసురుడు తాను ఎవరి నెత్తిన చేయి పెడితే వారు భస్మం అయి΄ోయేలా వరం అడిగితే ‘ఇచ్చితిని పో’ అన్నాడు. ఆనక అతడి నుంచి తప్పించుకోలేక పరుగులు తీయాల్సి వచ్చింది. 

ఆ తర్వాత బాణాసురుడు తన నగరానికి కాపలా కాయమంటే ‘చిత్తం మహాప్రభో’ అనేశాడు. రావణాసురుడు తన ఆత్మలింగాన్ని అడిగితే అరక్షణంలో అనుగ్రహించేశాడు. అది అతడికి దక్కితే ఆపై వాడి ఆగడాలకు ఇక పట్టపగ్గాలుండవని తెలిసి తక్కిన దేవతలందరూ కలిసి ఆత్మలింగాన్ని దక్కనీయకుండా చేయడం ఆ తర్వాత సంగతనుకోండి... అంతేనా! అనుగ్రహించడంలోనే కాదు... ఆయనకు ఆగ్రహం వచ్చినా కూడా పట్టలేరెవరూ... 

భయంతో తనను కాపాడమంటూ శరణుజొచ్చిన మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి పాశం విసిరినందుకు యముడి మీద కోపంతో ఎడం కాలితో ఒక్క తన్ను తన్ని అంతకుణ్ణే అంతం చేసిన కాలాంతకుడాయన! తపోదీక్షలో ఉన్న తన మనసును మథించిన మన్మథుణ్ణి ఒక్క కంటి చూపుతో కాల్చి బూడిద చేశాడు. ఒక్క హుంకారంతో అసురుణ్ణి, అతడి సైన్యాలనూ అంతం చేసిన మహాకాలే శ్వరుడాయన. ఆ పరమ శివుడు... ఆ ఆదిభిక్షువు.. ఆ పరమ దయాళువు... ఆ ఉమా మహేశ్వరుడు పట్టరాని సంతోషంతో ఆనంద తాండవం చేసే మహా పర్వదినమే మహాశివరాత్రి. 

ఈ పర్వదినాన ఇలా అర్పించాలి
పరమశివుడు జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించిన మహాశివరాత్రి పర్వదినాన చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ అర్చనలు, అభిషేకాలు, ఆరాధనలు, పంచాక్షరీ పారాయణలతో పరవశించిపోతుంటాయి. జన్మానికో శివరాత్రి అన్నట్టు... ఈ పర్వదినాన ఆ ముక్కంటిని ఏ విధంగా మొక్కాలో పెద్దలు చెప్పిన విధం తెలుసుకుందాం... 

శివరాత్రి వేళ సూర్యోదయం కంటె ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి శివపూజలు, అభిషేకాలు చేయాలి. పగలంతా ఉపవాస వ్రతాన్ని పాటించడంతోపాటు రాత్రంతా జాగరణ చేయాలి. మొదటిజాములో పరమేశ్వరుణ్ణి పాలతో అభిషేకించి, పుష్పాలతో పూజించి, పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండోజాములో పెరుగుతో అభిషేకించి, తులసీదళాలతో పూజించి, పాయసాన్ని నివేదించాలి. 

మూడవ జాములో నేతితో అభిషేకించి, మారేడు దళాలతో పూజించి, నువ్వులతో వండినపదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. నాలుగవ జాములో తేనెతో అభిషేకించి పుష్పాలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వీటితోపాటు లింగోద్భవ సమయంలో పూజలు చేయడంతోపాటు శివనామస్మరణంతో రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటిరోజు తిరిగి శివపూజలు చేసి నైవేద్యం సమర్పించి, భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. ఈ మహాపర్వదినాన పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరిపించడం ఆచారం. 

ఏకబిల్వం శివార్పణం... 
శివరాత్రినాడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయని, కనుక శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైనా శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది.

శివరాత్రిదానం మహాపుణ్యఫలం
సంపద కలిగిన వారు ఈరోజు శక్తిని అనుసరించి బంగారం లేదా వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి పండితునికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం నశిస్తుందని, లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా... అంతులేనన్ని సంపదలు కలుగుతాయని శాస్త్రోక్తి.
– డి.వి.ఆర్‌. 

(చదవండి: ఆయన జగం ..ఆమె సగం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement