ఒకసారి నోటి నుంచి వచ్చిన మాటను వెనక్కి తీసుకోలేం..
ప్రాచీన భారతీయ ఇతిహాసాలు, పురాణాలు కేవలం కథల సమాహారం మాత్రమే కాదు... మానవ జీవన విలువలను, కర్మ సిద్ధాంతాన్ని బోధించే అద్భుత జ్ఞాన నిధులు. మన సంస్కృతి లో ‘వాక్కు’కు అత్యున్నత స్థానం ఉంది. ఒకసారి నోటి నుంచి వచ్చిన మాటను వెనక్కి తీసుకోలేం. అందుకే, పూర్వం మహర్షులు, తపస్సంపన్నులు ఆగ్రహంతోనో, అధర్మాన్ని సహించలేకో ఇచ్చిన శాపాలు... చరిత్ర గమనాన్నే మార్చేశాయి. తీవ్రమైన భావోద్వేగాలు, ద్రోహం, అహంకారం, క్రోధం నుంచి పుట్టిన 5 శక్తిమంతమైన శాపాలు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాలు ఇవే...
అశ్వత్థామకు శ్రీ కృష్ణుని శాపం...
మహాభారత యుద్ధం ముగింపు దశలో, నిద్రిస్తున్న ఉపపాండవులను క్రూరంగా వధించిన అశ్వత్థామపై జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అశ్వత్థామకు మరణశిక్ష విధించకుండా, అంతకంటే భయంకరమైన శాపాన్ని ఇచ్చాడు పరమాత్ముడు. అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని తొలగించి, ఒళ్లంతా రక్తం, చీము కారుతున్న గాయాలతో, నిరంతర వేదనతో మూడు వేల సంవత్సరాల పాటు ఒంటరిగా భూమిపై సంచరించాలని శపించాడు.
పరిణామం... మరణం లేని అమరత్వం ఒక్కోసారి ఎంతటి నరకంగా మారుతుందో ఈ ఘటన నిరూపిస్తుంది. చేసిన కర్మల నుంచి, అధర్మం నుంచి ఎంతటి యోధుడైనా తప్పించుకోలేడని, ప్రకృతి నియమాలకు అందరూ లొంగాల్సిందేనని ఈ శాపం మనకు బోధిస్తుంది.
నారద మహర్షి శాపం...
ఒకానొక సందర్భంలో నారద మహర్షి మోహపాశంలో చిక్కుకున్న ప్పుడు, శ్రీమహావిష్ణువు ఆయనకు హితం చేయడం కోసం మాయా రూపంతో నారదుడిని పరీక్షించి విఫలుడిని చేస్తాడు. భంగపడిన నారదుడు తీవ్ర అవమాన భారంతో, విచక్షణ కోల్పోయి విష్ణుమూర్తినే శపిస్తాడు. తాను ఏ విధంగానైతే స్త్రీ విరహంతో బాధపడ్డాడో, అదే విధంగా విష్ణుమూర్తి కూడా భూలోకంలో మానవుడిగా జన్మించి, భార్యావియోగాన్ని అనుభవించాలని, కోతులే ఆయనకు సహాయం చేయాలని శపించాడు.
పరిణామం... ఈ శాప ఫలితంగానే త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించిన పరమాత్ముడు... సీతాదేవిని కోల్పోయి, అరణ్యాలలో తీవ్ర విరహ వేదనను అనుభవించాడు. వానరుల సహాయంతో లంకపై దండెత్తాడు. దైవమైనా సరే, భక్తుని వాక్కును గౌరవించక తప్పదనే సత్యాన్ని ఈ కథ చాటిచెబుతుంది.
గాంధారి శాపం...
కురుక్షేత్ర మహాసంగ్రామంలో తన నూరుగురు కుమారులను కోల్పోయిన గాంధారి దేవి దుఃఖం క్రోధంగా మారింది. ఈ సర్వనాశనానికి అంతటా ఉండి నడిపించిన శ్రీ కృష్ణు్ణడే కారణమని ఆమె భావించింది. భారతీయులందరినీ కాపాడగలిగే శక్తి ఉండి కూడా యుద్ధాన్ని ఆపనందుకు... ఏ విధంగానైతే కౌరవ వంశం అంతమైందో, అదే విధంగా 36 ఏళ్ల తర్వాత కృష్ణుడి కళ్లముందే యాదవ వంశం కూడా అంతర్గత కలహాలతో నశించిపోతుందని శపించింది.
పరిణామం... గాంధారి శాపం వృథా పోలేదు. మౌసల పర్వం నాటికి యాదవులంతా ప్రభాస తీర్థంలో ఒకరినొకరు హింసించుకుని సర్వనాశనమయ్యారు. చివరికి శ్రీ కృష్ణుడు కూడా ఒక బోయవాడి బాణానికి చిక్కి, ఏకాకిగా అవతారాన్ని చాలించాల్సి వచ్చింది. ఒక తల్లి ఆక్రందన, దుఃఖం ఎంతటి శక్తిమంతమైనవో ఈ ఘట్టం వివరిస్తుంది.
దుర్వాస మహర్షి శాపం...
శకుంతల దుష్యంతుడి ప్రేమలో మునిగిపోయి, తన ఆశ్రమానికి వచ్చిన తపోధనుడైన దుర్వాస మహర్షిని గమనించకుండా అగౌరవపరుస్తుంది. తీవ్ర కోపిష్టిగా పేరొందిన దుర్వాసుడు ఆమె ప్రవర్తనకు ఆగ్రహించి శాపాన్ని ఇస్తాడు. ‘నువ్వు ఎవరి ధ్యానంలో మునిగిపోయి నన్ను నిర్లక్ష్యం చేశావో... ఆ వ్యక్తి నిన్ను పూర్తిగా మర్చిపోవు గాక!‘ అని శపించాడు.
పరిణామం... దీనివల్ల దుష్యంతుడు శకుంతలను పూర్తిగా మరచిపోతాడు. శకుంతల ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక క్షణ కాలపు చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని ఎంతటి అగాధంలోకి నెడుతుందో, అలాగే అతిథి మర్యాద ఎంత ముఖ్యమో ఈ వృత్తాంతం తెలియజేస్తుంది.
వశిష్ఠుడి శాపం...
దేవతలు ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని పవిత్రమైన కామధేనువును అపహరించడానికి ప్రయత్నిస్తారు. త్రికాలజ్ఞాని అయిన వశిష్ఠుడు వారి తప్పును తెలుసుకుని తీవ్రంగా శపించాడు. దివ్యలోకంలో ఉండే అర్హతను కోల్పోయి, అష్టవసువులంతా భూలోకంలో మానవులుగా జన్మించాలని శపించాడు.
పరిణామం... ఈ శాపం వల్లే వసువులు గంగాదేవి గర్భాన జన్మించాల్సి వచ్చింది. వారిలో ఏడుగురిని గంగాదేవి పుట్టగానే నదిలో కలిపేసి శాపవిముక్తి కలిగించగా, ఎనిమిదో వసువు మాత్రం భూమిపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆయనే మహాభారతంలో అజేయ యోధుడిగా పేరొందిన ’భీష్మ పితామహుడు’. దేవతలైనా సరే కర్మఫలాన్ని అనుభవించక తప్పదని ఈ కథ చెబుతుంది. ప్రాచీనగాథలలోని ఈ శాపాలు కేవలం శిక్షలు మాత్రమే కావు... అవి మనకు కొన్ని జీవితసత్యాలను బోధిస్తాయి. కోపం, అహంకారం, నిర్లక్ష్యం ఎంతటి వారినైనా పతనానికి నడిపిస్తాయని హెచ్చరిస్తాయి.
మాట అనేది చాలా పదునైన ఆయుధం, దాన్ని ఉపయోగించేటప్పుడు వివేకం ఎంత అవసరమో ఈ కథలు మనకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాయి. – పసుపులేటి వెంకటేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు


