టెక్నో ఉమెన్
తమ సంస్థకు సంబంధించి అన్ని విభాగాలలో ఏఐ–సాంకేతికతను అనుసరిస్తోంది ప్రముఖ ఇ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా. అమెజాన్ ఇండియాలో ఏఐ ఇన్నోవేషన్కు సంబంధించి ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్ ఇండియా లీడర్స్ గీతాంజలి భుతాని, పాయల్ గుప్తా, శ్వేత శంకర్ జెన్ ఏఐ ఆధారిత షాపింగ్ ఆవిష్కరణను ముందుకు నడిపిస్తూనే అమెజాన్ విట్, విల్, కెటపల్ట్, అమెజాన్ సహేలి కార్యక్రమాల ద్వారా మహిళలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.
మూడింతలు పెంచేలా...
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన గీతాంజలి భుతాని హై–వాల్యూమ్ సిస్టమ్లను అభివృద్ధి చేసే బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సిస్టమ్ల ద్వారా జరిగే లావాదేవీలను మూడు రెట్లు పెంచడం ఆమె లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక ఆలోచన రెండూ అవసరమయ్యే క్లిష్టమైన ఇంజినీరింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గీతాంజలి, ‘పని విషయంలో ఉత్సాహవంతులైన ఉద్యోగులు ఉంటే అత్యుత్తమ పనితీరును కనబరిచే సాంకేతిక వ్యవస్థలను సులభంగా నిర్మించవచ్చు.
ఆవిష్కరణలకు ఎప్పుడూ కొరత ఉండదు. ఉద్యోగులకు వారు ఊహించని అవకాశాలు ఇవ్వడం, విశ్వాసం ఉంచడం ద్వారా వారిలోని సామర్థ్యాన్ని ఎలా వెలికి తీయవచ్చో నేను ప్రత్యక్షంగా చూశాను’ అంటారు గీతాంజలి. అమెజాన్విట్, ఉమెన్ ఇన్ లీడర్షిప్ లాంటి కార్యక్రమాల ద్వారా మహిళా ఇంజినీర్లకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు గీతాంజలి, వారి కలలు ఎంత కష్టంగా అనిపించినా, వాటిని సాధించేలా ప్రోత్సహిస్తూ వారి కెరీర్ వృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నారు. వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నారు.
హైపర్ పర్సనలైజ్డ్
అమెజాన్లో సెంట్రల్ షాపింగ్ ఎక్స్పీరియెన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్గా పాయల్ గుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కీలకమైన షాపింగ్ అనుభవాలను అందించే, సాంకేతిక పరిష్కారాలను నిర్మించే ఇంజినీరింగ్ బృందాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. జనరేటివ్ ఏఐని ఉపయోగించి షాపింగ్ను వ్యక్తిగతీకరించిన (హైపర్ పర్సనలైజ్డ్), ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చడంపై దృష్టి పెట్టారు పాయల్ గుప్తా.
ఏఐ ఆధారిత ఆవిష్కరణలు
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన శ్వేతాశంకర్, వినియోగదారులకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్ఫామ్లను నిర్మించే ‘అమెజాన్ ఇండియా రిటైల్ టెక్నాలజీ’ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ఇండియాలో జెన్ ఏఐ కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఏఐ–ఆధారిత ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. రియల్–టైమ్ డేటా ప్రాసెసింగ్, అనాలిటిక్స్కు సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. మెరుగైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ‘సిస్టమ్లను నిర్మించడానికి టెక్నాలజీకి మించి ఆలోచించడం అవసరం’ అంటారు శ్వేతా శంకర్.
అమెజాన్ సహేలి
‘అమెజాన్ సహేలి’ అనేది అమెజాన్ ఇండియా చేపట్టిన మహిళా సాధికారత కార్యక్రమం. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలు, మహిళల నేతృత్వంలోని బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడంలో ‘అమెజాన్ సహేలి’ సహాయపడుతుంది. అమెజాన్లో తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి మహిళలకు శిక్షణ, ఆన్బోర్డింగ్ సహాయం, కేటలాగింగ్ అసిస్టెంట్స్, రాయితీ రుసుము, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తుంది. గీతాంజలి భుతాని, శ్వేతా శంకర్, పాయల్ గుప్తాలాంటి లీడర్స్ మహిళా సాధికారత కార్యక్రమం ‘అమెజాన్ సహేలి’కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.


