ఏలూరు (ఆర్ఆర్పేట): రహదారి నిర్మాణం, మరమ్మతుల సమయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్తో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఉంగుటూరు–బాదంపూడి మధ్య జాతీయ రహదారిపై మరమ్మతుల సమయంలో సరైన సైన్, హెచ్చరిక బోర్డులు లేని కారణంగా ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడని, సదరు కాంట్రాక్టు సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పారు.
రహ్ వీర్పై అవగాహన
రహ్వీర్ పథకంపై విస్తత అవగాహన కలిగించాలని కలెక్టర్ తెలిపారు. బాధితుడిని ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి చేర్చి కాపాడే వారికి రహ్ వీర్ పథకం కింద రూ.25 వేల బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందిస్తామన్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్ర మాదాలకు కారణమవుతున్న ఆక్రమణలు తొలగించాలన్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన ద్వారానే వాటి వినియోగాన్ని నివారించవచ్చన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యా లు జోలికి వెళితే భవిష్యత్ అంధకారమవుతుందని, ఈ మేరకు అవగాహన సదస్సులు నిర్వహించాల న్నారు. రవాణాశాఖ అధికారి శేఖర్, డీపీఓ మల్లికార్జునరావు, డీఎంహెచ్ఓ శోభ, ఆర్అండ్బీ ఎస్ఈ విజయరత్నం తదితరులు పాల్గొన్నారు.


