కుక్కునూరు: ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే అక్కడక్కడా జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వాతావరణంలో మార్పులు, నిరంతర వర్షాలు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు, వైరస్లు, ఇతర క్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులలో రోగనిరోధక శక్తి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల ఈ కాలంలో జ్వరాలు, జలుబు, దగ్గు, కడుపు సంబంధిత సమస్యలు త్వరగా సోకే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
నిర్లక్ష్యం వద్దు
జ్వరం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. సమయానికి చికిత్స పొందకపోతే సాధారణ జ్వరం కూడా తీవ్ర అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యం. కలుషిత నీరు, ఆహారానికి దూరంగా ఉంటూ కేవలం శుభ్రమైన తాగునీటినే ఉపయోగించాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడటం, దోమల పెరుగుదలను అరికట్టడం, చిన్నారులకు దోమల కాటు నుంచి రక్షణ కల్పించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తున్నాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. స్వయంగా మందులు వాడకుండా, వైద్యుల సూచనల మేరకు పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవాలి.
– డాక్టర్ వసుధ,
మెడికల్ ఆఫీసర్, కుక్కునూరు పీహెచ్సీ


