ఏలూరు టౌన్: రాష్ట్రంలో కూటమి సర్కారును ఎన్నికల హామీలను అమలు చేయండని ప్రశ్నిస్తే.. రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ అరాచక పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్కుమార్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపు మేరకు కర్నూలు పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు బాలుపై అక్రమ కేసులను తీవ్రంగా ఖండించారు. బుధవారం ఏలూరులోని పార్టీ కార్యాలయం వద్ద భారీఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై మండిపడ్డారు. ఈ సందర్భంగా కామిరెడ్డి నాని మాట్లాడుతూ కూటమి నేతలు ఎన్నికలకు ముందు అనేక హామీలు గుప్పించారనీ, ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తమకు బాగా తెలుసనీ, అన్నీ అంచనా వేసుకునే హామీలు ఇస్తున్నామని చెప్పిన కూటమి నేతలు, ఇప్పుడు హామీల అమలుకు డబ్బులు లేవని చెప్పటం సిగ్గుచేటన్నారు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామనీ లేదా ప్రతి నెలా నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని హామీ ఇవ్వటం నిజం కాదా అని నిలదీశారు. అధికారం చేపట్టి రెండేళ్లు కా వస్తున్నా నిరుద్యోగ భృతి గురించి ఒక్కమాట మా ట్లాడలేదనీ, యువత సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే రాజ్యద్రోహం కేసులు పెడుతున్నారని ఇదేనా ప్రజలకు ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి అని ప్రశ్నించారు.యువత జీవితాలతో చెలగాటం ఆడుతూ అక్రమ కేసులు, అరెస్టులు, రాజకీయ వేధింపులతో కుట్ర పూరిత పాలన చేస్తున్నారని విమర్శించారు. వేధింపులు, అక్రమ కేసులు తక్షణమే ఆపాలనీ డిమాండ్ చేశారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గేదెల సూర్యప్రకాష్, ఏలూరు నగర అధ్యక్షుడు గంటా సాయిప్రదీప్, దెందులూరు నియోజకవర్గ అధ్యక్షుడు తానింకి పెద్దిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, దెందులూరు మండల ఉపాధ్యక్షుడు పొన్నాల రాజు, నున్న రమేష్, కాలి బెన్నీ, రాజేష్, శ్రీధర్, ఏడుకొండలు, లక్ష్మణ్, బాలచందర్, కేశవ్, రాజు, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ యువజన నేతల నిరసన


