
సచివాలయాల్లో.. కూటమి బదిలీలలు
సాక్షి, భీమవరం: నెలాఖరు నాటికి సచివాలయ ఉద్యోగుల బదిలీలను పూర్తిచేసేందుకు మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరవు నాటికి ఒకే చోట ఐదేళ్ల కాలం పూర్తిచేసుకున్న వారి బదిలీ తప్పనిసరి. అలాగే ఐదేళ్లు పూర్తికాకున్నా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి అవకాశం ఇచ్చారు. అభ్యర్థన బదిలీ కావాలనుకునే వారు ఈనెల 22 నుంచి 24వ తేదీలోపు రిక్వెస్ట్ ట్రాన్సఫర్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలోని సొంత మండలాల్లో పనిచేసే వెసులుబాటును తొలగించింది. ఒకే చోట ఐదేళ్లుగా పనిచేస్తున్న వారి వివరాలను ఇప్పటికే ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేశారు. 25 నుంచి 29లోపు ప్రాధాన్యతను అనుసరించి బదిలీలు పూర్తిచేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగి పనిచేసే విభాగాన్ని బట్టి సంబంధిత శాఖల పర్యవేక్షణలో బదిలీలు జరుగుతాయి.
సచివాలయ ఉద్యోగులపై కక్ష: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. సర్వేల పేరిట తిప్పడం, గతంలో వలంటీర్లు చేసిన పనులను వీరికి అప్పగించడం ద్వారా పనిభారం పెంచేసింది. క్లస్టర్ల పేరిట ఉద్యోగులను క్రమబద్ధీకరించి మిగిలిన వారిని ఇతర శాఖల్లో భర్తీ చేసే యోచన చేస్తోంది. కేవలం రూ.29 వేల నుంచి రూ.31 వేల జీతంపై పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు సొంత మండలాల్లో పనిచేయకూడదన్న కూటమి ఆదేశాలు ఇవ్వడం, బదిలీలపై స్పష్టత ఇవ్వకపోవడం వారిని మరింత ఇబ్బంది పెట్టేందుకేనని పలువురు ఉద్యో గులు విమర్శిస్తున్నారు.
గత ప్రభుత్వంలో పారదర్శకంగా..
ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను తెచ్చారు. రాజకీయ జోక్యం, అవినీతి, అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేశారు. గ్రామాల్లో రెండు వేలు, పట్టణాల్లో నాలుగు వేల జనాభా ప్రాతిపధికన సచివాలయాలను ఏర్పాటుచేశారు. గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఉద్యాన అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ తదితర పోస్టులను నియమించించారు. తద్వారా జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 35 శాఖలకు చెందిన 500లకు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలను నిర్వీర్యం చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.
సిఫార్సుల పర్వం
ఉద్యోగులను కూటమి నేతల చెప్పుచేతల్లో పెట్టే ఎత్తుగడ
బదిలీల నిర్వహణపై స్పష్టత లేని జీఓ
మెరిట్ను పక్కనపెట్టి సిఫార్సు లేఖలున్న వారికే ప్రాధాన్యం
ఈ మేరకు ప్రొఫార్మాలో వీఐపీ కాలమ్
సిఫార్సు లేఖల కోసం నేతల వద్దకు ఉద్యోగుల ప్రదక్షిణలు
చెప్పినట్టు పనిచేసే వారికే ఎమ్మెల్యేల లేఖలు